అనుమానాలు నిజమయ్యాయి! గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ మార్పు విషయంలో వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. విరాట్ కోహ్లీని తప్పిస్తూ పరిమిత ఓవర్ల ఫార్మాట్ పగ్గాలను హిట్మ్యాన్ రోహిత్శర్మకు అందించారు. ఇప్పటికే టీ20 కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్..సఫారీ పర్యటనలో కోహ్లీ నుంచి నాయకత్వ బాధ్యతలు అందుకోనున్నాడు. టెస్టుల విషయానికొస్తే కోహ్లీ కెప్టెన్సీని కొనసాగించడానికి మొగ్గుచూపిన బీసీసీఐ..వైస్ కెప్టెన్సీ నుంచి రహానేపై వేటు వేస్తూ రోహిత్ను లైన్లోకి తీసుకొచ్చింది. మొత్తంగా మరికొన్ని రోజుల్లో భారత పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ను చూడబోతమనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదనిపిస్తుంది.సఫారీ పర్యటనలో మూడు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐపలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు నాయకత్వంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్నేండ్లుగా తనదైన శైలిలో జట్టును ముందుండి నడిపిస్తున్న విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ రోహిత్శర్మకు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికాలో ఈనెల 26 నుంచి మొదలయ్యే మూడు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం 18 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో భాగంగా సీనియర్ సెలెక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. భవిష్యత్లో మెగాటోర్నీలను దృష్టిలో పెట్టుకుని రోహిత్కు వైట్బాల్ కెప్టెన్సీని అప్పగించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో 2022 టీ20 ప్రపంచకప్తో పాటు స్వదేశం వేదికగా 2023లో వన్డే వరల్డ్కప్ వరకు హిట్మ్యాన్ కెప్టెన్గా కొనసాగుతాడని బోర్డు ప్రకటించింది. అయితే దీని వెనుక బోర్డు బాగానే మథనం చేసినట్లు కనిపిస్తున్నది. ఇటీవలి టీ20 ప్రపంచకప్లో గ్రూపు దశలోనే టీమ్ఇండియా వైదొలుగడం, మెగాటోర్నీ నాకౌట్ మ్యాచ్లు చేజార్చుకోవడంతో కోహ్లీ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న మెగాటోర్నీలను దృష్టిలో పెట్టుకుని రోహిత్కు పగ్గాలు అప్పగించినట్లు బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టెస్టుల్లోనూ రోహిత్ వైపు మొగ్గుచూపుతూ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
విహారికి చోటు: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో తెలుగు స్టార్ క్రికెటర్ హనుమ విహారికి బెర్తు దక్కింది. ప్రస్తుతం సఫారీ పర్యటనలో భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా రాణిస్తున్న విహారి ప్రదర్శనకు సెలెక్టర్లు మొగ్గుచూపారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ పర్యటనలో గాయపడ్డ ఆల్రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్, ఓపెనర్ శుభ్మన్ గిల్..సఫారీ పర్యటనకు దూరమయ్యారు. దీంతో సీనియర్లు కోహ్లీ, పుజార, రహానే, రోహిత్పై భారం పడనుంది. గత కొన్ని సిరీస్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పుజార, రహానేకు ఇదే ఆఖరి అవకాశంగా కనిపిస్తున్నది. ఇందులో గనుక విఫలమైతే ఈ ఇద్దరికి జాతీయ జట్టులో మళ్లీ చోటు దక్కడం కష్టమే కావచ్చు. జడేజా, అక్షర్ గైర్హాజరీలో అశ్విన్ స్పిన్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్శర్మకు మరో అవకాశమివ్వగా..బుమ్రా, షమీ, శార్దుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న నవదీప్సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జన్ నాగస్వాలాను స్టాండ్బైగా ఎంపిక చేశారు.
టెస్టు జట్టు: కోహ్లీ(కెప్టెన్), రోహిత్(వైస్ కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజార, రహానే, అయ్యర్, విహారి, పంత్, సాహా, అశ్విన్, జయంత్, ఇషాంత్, షమీ, బుమ్రా, శార్దుల్, సిరాజ్. స్టాండ్బై: నవ్దీప్, సౌరభ్, దీపక్, అర్జాన్