Rinku Singh Sixer: ఆస్ట్రేలియాతో గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో యువ భారత్ అద్భుత విజయంతో సిరీస్లో బోణీ కొట్టింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో సాధించింది. రింకూ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే రింకూ ఆఖరి బంతికి కొట్టిన సిక్సర్ కౌంట్ కాలేదు. అది జట్టుకు గానీ అతడి వ్యక్తిగత స్కోరుకు గానీ జమకాలేదు. ఎందుకు..? రింకూ సిక్సర్ ఎందుకు కౌంట్ కాలేదు..?
ఆఖరి ఓవర్లో భారత్ ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికే రింకూ బౌండరీ కొట్టాడు. కానీ అక్షర్ పటేల్ తో పాటు రవిబిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లు రనౌట్ అయ్యారు. ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన క్రమంలో అబాట్ వేసిన బంతిని రింకూ లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టాడు. అయినా అది కౌంట్ కాలేదు. అబాట్ వేసిన బంతి నోబాల్. ఐసీసీ పురుషుల టీ20 నిబంధన 16.5.1 ప్రకారం.. 16.1, 16.2, 16.3 క్లాజుల ప్రకారం ఒక మ్యాచ్ ముగింపునకు చేరి ఫలితం తేలితే ఆ తర్వాత వచ్చే పరుగులను పరిగణనలోకి తీసుకోరు. ఈ లెక్కన నిన్నటి మ్యాచ్లో సీన్ అబాట్ అప్పటికే నోబాల్ వేయడంతో భారత విజయం ఖరారైపోయింది. దీంతో రింకూ సిక్సర్ ద్వారా వచ్చిన పరుగులు అతడికి గానీ జట్టుకు గానీ చేరలేదు.
Indian team cutting the special cake after the victory in the first T20I.pic.twitter.com/zig1q1YFOx
— Johns. (@CricCrazyJohns) November 24, 2023
ఒకవేళ ఈ మ్యాచ్లో ఆఖరి బంతికి నోబాల్ వేసినా భారత జట్టు గెలవాల్సిన పరుగుల లక్ష్యం ఒకటి కంటే ఎక్కువగా ఉండి ఉంటే అవి రింకూ వ్యక్తిగత స్కోరుకు కలవకపోయినా జట్టు స్కోరుకైనా కలిసేవని ఐసీసీ నిబంధనల ద్వారా తెలుస్తున్నది.