Rinku Singh | రింకూ సింగ్..ఐపీఎల్ సెన్సెషన్! ఒకే ఒక ఇన్నింగ్స్తో యావత్ దేశం దృష్టిలో పడిన క్రికెటర్. ఇన్నాళ్లు కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో కొనసాగినా ఎప్పుడు పెద్దగా వెలుగులోకి రాని రింకూ సింగ్..గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ద్వారా తన ప్రతిభ ఏంటో చేతల్లో చూపెట్టాడు. గెలుపుపై ఆశలు వదులుకున్న వేళ.. తాను ఉన్నానంటూ ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించి ఔరా అనిపించుకున్నాడు. యశ్ దయాల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు భారీ సిక్స్లు కొట్టి నయా సంచలనంగా నిలిచాడు.
స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్సింగ్ సిక్సర్ల ఫీట్ను తలపిస్తూ రింకూసింగ్ సాగించిన విధ్వంసం ఐపీఎల్లో చిరకాలం గుర్తిండిపోతుంది. అప్పటివరకు అనామక ప్లేయర్గా కొనసాగిన ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు..ఆ ఇన్నింగ్స్తో ఎక్కడికో వెళ్లిపోయాడు. అయితే చైనా వేదికగా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన భారత జట్టులో రింకూసింగ్ చోటు దక్కించుకున్నాడు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న తన కల సాకారమైందని ఈ సందర్భంగా రింకూసింగ్ చెప్పుకొచ్చాడు. మామూలు మధ్య తరగతి కుటుంబానికి చెందిన రింకూసింగ్..అంచలంచెలుగా ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. ఇదిలా ఉంటే జాతీయ జట్టుకు ఎంపికైన వేళ..మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని రింకూ సంప్రదించాడు.
తన కెరీర్లో ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ధోనీ.. తనదైన శైలిలో రింకూకు జ్ఞానబోధ చేశాడు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నావో అలాగే బ్యాటింగ్ కొనసాగించమని చెప్పాడట. ఈ విషయాన్ని రింకూ మీడియా ద్వారా వివరించాడు. మొత్తంగా ఆసియా గేమ్స్ ద్వారా రింకూసింగ్..టీమ్ఇండియాకు ఎంపిక కావడం సగటు భారత అభిమానికి సంతోషం కల్గించే సందర్భం. ప్రతిభ ఉంటే పరపతితో సంబంధం లేకుండా జట్టులో చోటు లభిస్తుందనే దానికి రింకూ సరైన ఉదాహరణ అని చెప్పొచు.