ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఘోరమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకప్పుడు తన బ్యాటుతో ప్రపంచ క్రికెట్ను శాసించిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మూడేళ్లుగా ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా లేకుండా తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ మానసికంగా అలసిపోయాడని కొందరు వెటరన్లు అనడం మొదలైంది.
మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచి అందరూ కూడా కోహ్లీకి కొంత విశ్రాంతి అవసరం అని చెప్పడం మొదలుపెట్టారు. అయితే తానేమీ అలసిపోలేదని కోహ్లీ ఈ మధ్య కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్సీబీ తరఫున ఐపీఎల్ ఆడుతున్న సమయంలో అతనీ మాటలు అన్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండ్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాక్యలు చేశాడు.
దాదాపు ప్రతి ఆటగాడి జీవితంలో ఇలాంటి దశ ఉంటుందున్న పాంటింగ్.. ‘‘దాదాపు 10-12 ఏళ్లపాటు విరాట్ అద్భుతంగా ఆడాడు. ఆ సమంయలో అతను విఫలమైన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఐపీఎల్ సమయంలో కోహ్లీ అలసటపై చాలా చర్చ జరిగింది. ఇది కోహ్లీ వ్యక్తిగత విషయం.
అతనే తనను తాను అసెస్ చేసుకొని, తనది టెక్నికల్ సమస్యా? లేక మానసిక సమస్యా? అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. అతను మంచి ప్రొఫెషనల్ ప్లేయర్. కాబట్టి త్వరలోనే తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు కష్టపడతాడని నమ్మకం ఉంది’’ అని చెప్పాడు. అదే సమయంలో ఒక్కోసారి ఆటగాళ్లు తాము అలసిపోలేదంటూ.. తమను తామే మోసగించుకుంటారని కూడా పాంటింగ్ అన్నాడు.
‘‘ఆటగాళ్లు తాము అలసిపోయినట్లు అంగీకరించరు. ఎలాగోలా ట్రైనింగ్ టైంకు వచ్చేస్తారు. మ్యాచ్కు రెడీ అవుతారు. విశ్రాంతి తీసుకున్నప్పుడే తాము ఎంత అలసిపోయింది వాళ్లకు తెలిసి వస్తుంది’’ అని వివరించాడీ ఆసీస్ లెజెండ్. ప్రస్తుతం సౌతాఫ్రికాతో భారత్ ఆడుతున్న ఐదు టీ20ల సిరీస్లో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే టెస్టులో కోహ్లీ మళ్లీ ఆడతాడు.