IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఐదో ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్, దినేశ్ కార్తిక్లు జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందిస్తున్నా.. బౌలర్లు తేలిపోతున్నారు. పేసర్లు టాప్లే, విజయ్కుమార్, ఆకాశ్దీప్లు భారీగా పరుగులిస్తున్నారు. టీమిండియా పేస్రగా ఇరగదీసిన మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) కూడా నేనున్నానే భరోసా ఇవ్వలేకపోతున్నాడు.
ఇప్పటివకూ ఒక్క మ్యాచ్లోనూ సిరాజ్ తన స్థాయిలో చెలరేగలేదు. సొంతమైదానమైన చిన్నస్వామిలోనూ ఈ స్పీడ్స్టర్ తన మ్యాజిక్ చూపించలేదు. పదిహేడో సీజన్లో సిరాజ్ ఆరు మ్యాచుల్లో కేవలం నాలుగు వికెట్లు తీశాడంటేనే అతడి పేస్లో పదను, వైవిధ్యం తగ్గిందని అర్ధం చేసుకోవచ్చు.
హైదరాబాదీ పేసర్ అయిన సిరాజ్.. ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. నిరుడు ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై ఈ స్పీడ్స్టర్ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత పేసర్గా రికార్డు నెలకొల్పాడు. ఆ మ్యాచ్లో సిరాజ్ ప్రతాపానికి లంక 50 రన్స్కే పరిమితమైంది. అనంతరం దక్షిణాఫ్రికాపై కేప్ టౌన్ టెస్టులోనూ సిరాజ్ మియా విజృంభించాడు. 15 పరుగులకే 6 వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు.
అలాంటిది ఐపీఎల్ 17వ సీజన్లో ఏమైందో ఏమోగానీ సిరాజ్ ఓ సాధారణ బౌలర్ అయ్యాడు. అతడి ఓవర్లో అనామయ బ్యాటర్లు సైతం ఉతికేస్తున్నారు. ఓ వైపు భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Bumrah) సంచలన ప్రదర్శనతో ముంబై ఇండయిన్స్ విజయంలో భాగమవుతున్నాడు. కానీ, సిరాజ్ ఒక్క మ్యాచ్లోనూ ఆర్సీబీని ఆదుకోలేదు. ముంబై ఇండియన్స్(Mumbai Iindians)పై దారుణ ఓటమి అనంతరం డూప్లెసిస్ సైతం తమ జట్టు బౌలింగ్ సరిగాలేదని అన్నాడు.
దాంతో, సిరాజ్కు రెండు మూడు మ్యాచుల్లో విశ్రాంతి ఇవ్వాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) అన్నాడు. శారీరకంగా, మానసికంగా సిరాజ్ చాలా అలసిపోయాడు. అతడికి కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వడం మంచింది అని భజ్జీ తెలిపాడు. తర్వాతి పోరులో ఏప్రిల్ 15వ తేదీ సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తలపడనుంది.