120 బంతుల్లో 182 పరుగులు. లక్నో సూపర్ కింగ్స్ (ఎల్ఎస్జీ) తో మ్యాచ్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) లక్ష్యమది. కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్, పాటిదార్, కార్తీక్ వంటి హిట్టర్లు ఉన్న బెంగళూరులో ఏ ఇద్దరు నిలిచినా ఇదేం పెద్ద లక్ష్యం కాదు. కానీ ఐపీఎల్ నయా సంచలనం, తన వేగంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను తన వైపునకు తిప్పుకున్న ఢిల్లీ కుర్రాడు మయాంక్ యాదవ్.. బెంగళూరు బ్యాటర్లను ఆటాడుకున్నాడు. అతడు వేసే స్పీడ్కు ఆర్సీబీ టాపార్డర్ దాసోహమంది. బాల్ టచ్ చేస్తే క్యాచ్.. మిస్ అయితే బౌల్డ్ అన్న రేంజ్లో అతడి విధ్వంసం సాగడంతో బెంగళూరు హోంగ్రౌండ్లో వరుసగా రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది.
Mayank Yadav | బెంగళూరు: ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానం (చిన్నస్వామి)లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. లక్నో యువ సంచలనం మయాంక్ యాదవ్ పేస్కు ఆర్సీబీ టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టడంతో బెంగళూరుకు రెండో ఓటమి తప్పలేదు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
క్వింటన్ డికాక్ (56 బంతుల్లో 81, 8 ఫోర్లు, 5 సిక్సర్లు), నికోలస్ పూరన్ (21 బంతుల్లో 40 నాటౌట్, 1 ఫోర్, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అవడంతో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు తరఫున మహిపాల్ లోమ్రర్ (13 బంతుల్లో 33, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మయాంక్ యాదవ్ (3/14) నాలుగు ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు.
డికాక్తో మొదలై..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. కెఎల్ రాహుల్ (20) నెమ్మదిగా ఆడినా క్వింటన్ డికాక్ ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రీస్ టాప్లీ వేసిన మొదటి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదిన అతడు.. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్సర్లతో జోరు కొనసాగించాడు. రాహుల్.. మ్యాక్స్వెల్ బౌలింగ్లో మయాంక్ దాగర్ చేతికి చిక్కగా పడిక్కల్ (6) మరోసారి నిరాశపరిచాడు. స్టోయినిస్ (15 బంతుల్లో 24, 1 ఫోర్, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న డికాక్.. టాప్లీ బౌలింగ్లో దాగర్కు క్యాచ్ ఇచ్చాడు.
పూరన్తో ముగించి..
18 ఓవర్లు ముగిసేటప్పటికీ లక్నో స్కోరు 148-5. చివరి 12 బంతుల్లో లక్నో 33 పరుగులు సాధించిందంటే దానికి కారణం పూరన్. టాప్లీ వేసిన 19వ ఓవర్లో పూరన్.. హ్యాట్రిక్ సిక్సర్లతో 20 పరుగులు రాబట్టగా సిరాజ్ ఆఖరి ఓవర్లోనూ రెండు సిక్సర్లు బాదడంతో లక్నో పోరాడగలిగే లక్ష్యాన్ని నిలపగలిగింది.
మయాంక్ మెరుపులా..
ఎప్పుడెలా ఆడుతుందో తెలియని బెంగళూరు.. సొంత మైదానంలో మరోసారి నిరాశపరిచింది. ఆరంభం నుంచే స్పిన్నర్లతో దాడిని ప్రారంభించిన లక్నో.. ఆర్సీబీని తమ వ్యూహంలో బంధించింది. 16 బంతుల్లో 22 పరుగులు చేసిన కోహ్లీ.. తమిళనాడుకు చెందిన యువ స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సిద్ధార్థ్కు ఐపీఎల్లో ఇదే తొలి వికెట్.
ఇక నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ రాకతో ఆర్సీబీ కోలుకోలేదు. ఐదో ఓవర్ వేసిన అతడి బౌలింగ్లో మొదటి బంతికే డుప్లెసిస్ పరుగు తీయబోయి పడిక్కల్ డైరెక్ట్ త్రో తో రనౌట్ అయ్యాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని మయాంక్.. 151 కిలోమీటర్ల వేగంతో విసిరిన షార్ట్ లెంగ్త్ డెలివరీని ఆడబోయిన డేంజరస్ మ్యాక్స్వెల్ (0) మిడాన్ వద్ద పూరన్ క్యాచ్ పట్టడంతో అతడి కథ ముగిసింది. మయాంక్ తన మరుసటి ఓవర్లో కామెరూన్ గ్రీన్ (9)నూ క్లీన్ బౌల్డ్ చేసి ఆర్సీబీని కోలుకోనీయకుండా చేశాడు.
ఆర్సీబీ వికెట్ల పతనాన్ని ఐదు ఓవర్ల పాటు అడ్డుకున్న అనూజ్ రావత్ (11)ను స్టోయినిస్ ఔట్ చేశాడు. 21 బంతుల్లో 29 పరుగులు చేసిన పాటిదార్ కూడా మయాంక్ మాయకే దాసోహమయ్యాడు. ఆర్సీబీ విజయానికి 5 ఓవర్లలో 78 పరుగులు అవసరమవగా.. 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లూ కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో : 20 ఓవర్లలో 181/5 (డికాక్ 81, పూరన్ 40 నాటౌట్, మ్యాక్స్వెల్ 2/23, యశ్ దయాల్ 1/24) బెంగళూరు: 19.4 ఓవర్లలో 153 (లోమ్రర్ 33, పాటిదార్ 29, మయాంక్ 3/14, సిద్ధార్థ్ 1/21)