స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే అనూజ్ రావత్ (0) డకౌట్ అవగా.. రెండో ఓవర్లో ఆర్సీబీ సారధి ఫాఫ్ డు ప్లెసిస్ (5) పెవిలియన్ చేరాడు. సౌతీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది.
దాన్ని బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న రహానే అందుకోవడంతో డుప్లెసిస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లీ (12) కూడా అవుటయ్యాడు. ఉమేష్ వేసిన బంతి ఆరో స్టంప్ వద్దకు వచ్చింది. దాన్ని కోహ్లీ అనవసరంగా కదిలించుకున్నాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ జాక్సన్ చేతుల్లో పడింది. కోహ్లీ కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు జట్టు 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.