RCB vs CSK : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ మరికాసేపట్లో మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీ ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్టు తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం. కానీ, ఇప్పుడు సీన్ మారింది. గత మూడు మ్యాచుల్లో సూపర్ కింగ్స్కు బెంగళూరు షాకిచ్చింది. హ్యాట్రిక్ విజయాలతో చెన్నైపై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు గెలుపుపై ధీమాతో ఉంది. ఈ సీజన్లో రెండు ఓటముల నుంచి తేరుకొని బోణీ కొట్టాలని సీఎస్కే పట్టుదలతో ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొన్ని పోరాటాలు అభిమానులకు కావాల్సినంత కిక్ ఇస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కూడా అలాంటిదే. ఐపీఎల్ తొలినాళ్లలో సీఎస్కే దెబ్బకు ఆర్సీబీ వణికిపోయేది. ఇప్పటివరకూ 34సార్లు ఇరుజట్లు తలపడగా.. 21 విజయాలతో చెన్నై ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. చెన్నై విజయ సారథుడు ఎంఎస్ ధోనీ అందుబాటులో లేడు. పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నిరుడు ఆర్సీబీ తొలిసారి ఛాంపియన్గా అవతరించింది.
RCB have turned the tide in their rivalry against CSK 🔺 pic.twitter.com/UcH2aBBOpo
— ESPNcricinfo (@ESPNcricinfo) April 4, 2026
గత మూడు మ్యాచుల్లో సూపర్ కింగ్స్ మీద ఆర్సీబీ పైచేయి సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో మమ్మల్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరికలు పంపింది. నిరుడు చిన్నస్వామిలో 2 పరుగుల తేడాతో, చెపాక్లో 50 రన్స్తో… 17వ సీజన్లో 27 పరుగుల తేడాతో చెన్నైని ఆర్సీబీ ఓడించింది. అసలే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా ఆడుతున్న రజత్ పాటిదార్ బృందం కసితో ఆడుతోంది. ధోనీ దూరమవ్వడం, సంజూ శాంసన్ వైఫల్యంతో ఈ సీజన్ తొలి మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యం.. రెండో మ్యాచుల్లో బౌలర్ల వైఫల్యంతో పరాజయం పాలైన సీఎస్కే బోణీ కొట్టాలంటే బెంగళూరును ఓడించాల్సిందే.