సాధారణంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడే రెండు జట్లు.. తాజా సీజన్లో ఏమాత్రం ఆకట్టుకోలేక అట్టడుగు ప్లేస్ కోసం ఆరాట పడుతున్నాయి. హైదరాబాద్ చేతిలో పరాజయంతో చెన్నై నాలుగో ఓటమిని మూటగట్టుకోగా.. బెంగళూరు చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ లెక్క సమం చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో మొదట రోహిత్ సేనను కట్టడి చేసిన బెంగళూరు.. ఆనక అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ మెరుపులతో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది.
పుణె: ఇతర జట్లకు సాధ్యంకాని రీతిలో ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ తాజా సీజన్లో తీవ్రంగా తడబడుతున్నది. దేశీయ ఆటగాళ్లపై నమ్మకంతో తుది జట్టులో కేవలం ఇద్దరే విదేశీయులతో బరిలోకి దిగిన రోహిత్ సేన లీగ్లో వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. శనివారం జరిగిన రెండో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో 50/0తో పటిష్ఠ స్థితిలో నిలిచిన ముంబై.. బెంగళూరు బౌలర్ల ధాటికి 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. బ్రేవిస్ (8), తిలక్ వర్మ (0), పొలార్డ్ (0), రమన్దీప్ సింగ్ (6) విఫలమయ్యారు. ఈ దశలో సూర్యకుమార్ దమ్ము చూపించాడు. మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోయినా.. భారీ షాట్లతో విరుచుకుపడి ముంబైకి గౌరవప్రద స్కోరు అందించాడు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (47 బంతుల్లో 66; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (48; 5 ఫోర్లు) రాణించాడు. రావత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 151/6 (సూర్యకుమార్ 68 నాటౌట్, రోహిత్ 26; హర్షల్ 2/23, హసరంగ 2/28), బెంగళూరు: 18.3 ఓవర్లలో 152/3 (అనూజ్ 66, కోహ్లీ 48; ఉనాద్కట్ 1/30).