రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ్డూ పేరే ప్రకటించాడు. అందుకే ఇప్పుడు ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా జడ్డూ, ధోనీ గురించే మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్తో ధోనీ వారసుడిగా చెప్పుకుంటున్న జడ్డూని.. ఒకసారి ఐపీఎల్లో బ్యాన్ చేశారని తెలుసా? ఇది జరిగి పన్నెండేళ్లు గడిచిపోయాయి కూడా. 2008లో తొలిసారి ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పుడు అండర్ 19 డ్రాఫ్ట్లో ఉన్న జడ్డూను రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది.
మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సారధ్యంలో ఐపీఎల్ తొలి ట్రోఫీ గెలిచిన జట్టులో జడ్డూ కూడా సభ్యుడే. ఆ తర్వాతి ఏడాది కూడా ఆర్ఆర్ తరఫున ఆడిన జడ్డూ.. 2010లో రాజస్థాన్తో ఒప్పందం చేసుకోవడానికి నిరాకరించాడు. వేరే ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.
దీంతో జడ్డూ, ఆర్ఆర్ వాదనలు విన్న బీసీసీఊ ప్రెసిడెంట్.. అతన్ని ఆ ఏడాది ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేశారు. అప్పటి ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీ మాట్లాడుతూ.. ఆటగాళ్ల మార్గదర్శకాలను ఎవరు ఉల్లంఘించినా సీరియస్గా తీసుకుంటామని, ఐపీఎల్ లేదా బీసీసీఐతో ఆటలాడాలని అనుకున్నా, బ్లాక్మెయిల్ చేయాలని చూసినా సహించబోమని హెచ్చరికలు చేశాడు.
ఆ తర్వాత 2011 ఐపీఎల్ వేలంలో పాల్గొన్న జడ్డూని కోచి టస్కర్స్ కొనుగోలు చేసింది. కానీ ఆ మరుసటి ఏడాదే ఆ జట్టు ఐపీఎల్ నుంచి తప్పించుకుంది. మళ్లీ వేలంలో పాల్గొన్న అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి జడ్డూ మరో జట్టు వైపు చూడలేదు.
మధ్యలో సీఎస్కేపై రెండేళ్లు బ్యాన్ వేసినప్పుడు మాత్రమే వేరే జట్లకు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ చెన్నై శిబిరంలో చేరిపోయాడు. ధోనీ, రైనాతో కలిసి చెన్నై జట్టు మూలస్తంభంగా మారాడు. గతేడాది సూపర్ ఫామ్తో అదరగొట్టాడు. ఇదిగో ఇప్పుడు అదే జట్టులో ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు అందుకుంటున్నాడు.