Virat Kohli | ముంబై: భారత స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. న్యూజిలాండ్తో సెమీఫైనల్లో సెంచరీ ద్వారా వన్డేల్లో 50 శతకాల మార్క్ అందుకున్న విరాట్ను పలువురు ప్రముఖలు అభినందనల సందేశాలతో ముంచెత్తుతున్నారు. కోహ్లీ వేరే గ్రహం నుంచి వచ్చాడంటూ వెస్టిండీస్ గ్రేట్ వీవీయన్ రిచర్డ్స్ అంటే సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్..కోహ్లీని అభినందిస్తూ ఎక్స్లో సందేశం రాసుకొచ్చాడు. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శతక సెంచరీల రికార్డును కోహ్లీ కచ్చితంగా దాటేస్తాడని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.
అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ వంద శతకాలు చేయగా, కోహ్లీ 80 సెంచరీలతో కొనసాగుతుండగా, రికీ పాంటింగ్(71) మూడో స్థానంలో ఉన్నాడు. ఐసీసీకి ఇచ్చిన ప్రత్యేక రివ్యూలో శాస్త్రి పలు అంశాలను ప్రస్తావించాడు. ‘సచిన్ వంద సెంచరీలు చేస్తాడని ఎవరైనా ఊహించారా? ఇది అంతే. అతని దరిదాపుల్లో ఎవరూ రారనుకున్నాం. కానీ కోహ్లీ ప్రస్తుతం 80 సెంచరీలతో కొనసాగుతున్నాడు. రానున్న పది ఇన్నింగ్స్ల్లో అతడు కచ్చితంగా ఐదు సెంచరీలు కొడతాడు. ఇలాంటి ప్లేయర్లకు ఏదీ అసాధ్యం కాదు. ఒక్కసారి ఫామ్లోకి వచ్చారంటే వారిని ఆపడం అసాధ్యం. ప్రస్తుతం కోహ్లీ అన్ని ఫార్మాట్లలో ఉన్నాడు. మరో మూడు, నాలుగేండ్లు జాతీయ జట్టుకు ఆడుతాడు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా ఆడుతూ రికార్డులు కొల్లగొట్టడం అతని నైజం. అద్భుతమైన ఫిట్నెస్తో ఫోర్లు, సిక్స్ల కన్నా..వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తేందుకు విరాట్ ప్రయత్నిస్తాడు’ అని పేర్కొన్నాడు.