ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతోంది. 13 పాయింట్లతో పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. గత సీజన్లో సరైన ప్రదర్శన చేయకపోవడంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండవ స్థానంలో నిలిచింది. ఈ రోజు ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో గెలిస్తే క్వాలిఫై అవడం దాదాపు ఖాయం. అంతేకాకుండా ధోనీ యువ ఆటగాళ్లతో అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాడు. ఇదే విషయమై రవిశాస్త్రి ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు.
‘ధోనిది మాస్టర్ మైండ్. ఫామ్ లేకుండా ఇబ్బందిపడుతున్నఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో ధోనికి బాగా తెలుసు. యంగ్ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపి వారి నుంచి ఉత్తమ ఆటను బయటకు తీస్తాడు. అంతేకాకుండా టీంను బలంగా తయారు చేయడంలో ధోని స్పెషలిస్ట్. చెన్నై ప్లేఆఫ్స్కు వెళ్తే వారిని ఆపడం కష్టం ఎందుకంటే.. ప్లేఆఫ్స్లో రెండు మ్యాచ్లు చెన్నైలో జరగనున్నాయి. సొంతగడ్డపై భారీగా అభిమానుల మద్దతు ఉంటుందని’ అన్నారు.
మరోవైపు నేడు చెన్నై ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే వారి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. చెన్నై గెలిస్తే ప్లేఆఫ్స్ చేరడం మరింత సులభమవుతుంది. ఈ సీజన్లో ఈ రెండు టీంలు తలపడటం ఇదే మొదటిసారి.