భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడనున్న భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. సాయంత్రం అస్తమించే సూర్యుడు ఉదయం తిరిగిరాక మానడని.. అలాగే తను కూడా జట్టులో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో బిష్ణోయ్.. ‘సూర్యుడు తూర్పున ఉదయించక మానడు. మేము మళ్లీ ప్రయత్నిస్తాం..’ అని రాసుకొచ్చాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్-2022లో భారత జట్టుకు ఎంపికైన బిష్ణోయ్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. పాకిస్తాన్తో సూపర్-4లో మ్యాచ్ ఆడిన అతడు.. ఆ పోరులో బాబర్ ఆజమ్ వికెట్ తీశాడు.
ఆసియా కప్ తర్వాత బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో 15 మంది సభ్యులలో బిష్ణోయ్ పేరు లేదు. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్లను తీసుకున్న సెలక్టర్లు.. బిష్ణోయ్ను పక్కనబెట్టారు. అయితే అతడికి స్టాండ్ బై ప్లేయర్లలో అవకాశం దక్కింది.
ఆసియా కప్కు ముందు బిష్ణోయ్ వెస్టిండీస్తో మూడు మ్యాచ్లు ఆడాడు. ఆ సిరీస్లో 8 వికెట్లతో రాణించాడు. మొత్తంగా ఇప్పటివరకు భారత జట్టు తరఫున 10 టీ20లలో 16 వికెట్లు తీసిన బిష్ణోయ్ స్థానం ఇప్పటికీ పర్మనెంట్ కాలేదు. అశ్విన్, చాహల్ నుంచి బిష్ణోయ్కు తీవ్ర పోటీ ఎదురవుతున్నది.