Rashid Latif : భారత యంగ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను టెస్టుల్లో ఆడించాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. ఆసీస్తో టెస్టు సిరీస్లో నలుగురు పేసర్లలో ఒకడిగా అతడిని తీసుకోవాలని సూచించాడు. అతను బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని లతీప్ తెలిపాడు. ‘అర్ష్దీప్ సింగ్ ఊరించే బంతులతో బ్యాటర్లను షాట్లు ఆడేలా చేస్తాడు. ఈ మాట నేను అతను టీ20 జట్టుకు ఎంపికైనప్పుడే చెప్పాను. ఈ యంగ్స్టర్ బంతని సరైన ప్రదేశంలో విసురుతాడు. బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. అందుకని అతడిని టెస్టుల్లో ఆడించాలి’ అని లతీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నో బాల్స్తో విమర్శలు..
అర్ష్దీప్ సింగ్ ఇప్పటివరకూ భారత జట్టు తరఫున 26 టీ20లు, 3 వన్డేలు ఆడాడు. అయితే.. టెస్టుల్లో మాత్రం ఆరంగ్రేటం చేయలేదు. ఐపీఎల్లో అదరగొట్టిన అర్ష్దీప్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ యంగ్స్టర్ను చాలామంది మాజీలు బౌలింగ్ విభాగంలో భారత ఆశాకిరణం అంటూ కొనియాడారు. అయితే.. ఈమధ్య తరచూ నో బాల్స్ వేసి అతను విమర్శలకు గురయ్యాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. వెన్నెముక గాయం నుంచి కోలుకోని స్టార్ పేసర్ బుమ్రా రెండు టెస్టులకు దూరమయ్యాడు. దాంతో, మహమ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్లను ఎంపిక చేసింది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా భారత పర్యటనలో నాలుగు టెస్టులు ఆడనుంది. ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్పూర్లో మొదలవుతుంది.