అద్వితీయ ప్రదర్శనతో దుమ్మురేపిన యువ భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటికే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన యంగ్ ఇండియా.. పాంచ్ పటాకా మోగించింది. విండీస్ గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ఇండియా.. ఓటమి ఎరుగకుండా కప్పు చేజిక్కించుకుంది. బౌలింగ్లో రాజ్ బవా.. రవికుమార్ విశ్వరూపం కనబరిస్తే.. బ్యాటింగ్లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్ మరో క్లాసిక్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఫలితంగా మహమ్మద్ కైఫ్ (2000), విరాట్ కోహ్లీ (2008), ఉన్ముక్త్ చంద్ (2018) తర్వాత కప్పు పట్టిన ఐదో భారత కెప్టెన్గా యష్ ధుల్ రికార్డుల్లోకెక్కాడు.
అంటిగ్వా: వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత్.. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. అజేయంగా తుదిపోరుకు అర్హత సాధించిన యంగ్ ఇండియా.. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. శనివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజ్ బవా 5, రవి కుమార్ 4 వికెట్లతో విజృంభించగా.. ఇంగ్లండ్ మిడిలార్డర్ ప్లేయర్ జేమ్స్ రెవ్ (116 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం సునాయాస లక్ష్యఛేదనలో యువ భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. తెలుగు ఆటగాడు, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (50; 6 ఫోర్లు), నిషాంత్ సింధు (50 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. రాజ్ బవా (35; 2 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
61/6 నుంచి..
భారత పేసర్ల ధాటికి ఒక దశలో 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ను జేమ్స్ ఆదుకున్నాడు. ఆరంభంలో వరుసబెట్టి వికెట్లు పడగొట్టిన మన కుర్రాళ్లను జేమ్స్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఎనిమిదో వికెట్కు జేమ్స్ సేల్స్ (34 నాటౌట్)తో కలిసి 93 పరుగులు జోడించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రెవ్.. కుదురుకున్నాక వరుస బౌండ్రీలతో విజృంభించాడు. జేమ్స్ సేల్స్ నుంచి అతడికి చక్కటి సహకారం లభించింది. అయితే ఈ దశలో కౌషల్ తంబే కండ్లు చెదిరే క్యాచ్తో రెవ్ను పెవిలియన్ పంపాడు. రవికుమార్ బౌలింగ్లో జేమ్స్ డీప్ స్కేర్ లెగ్ వైపు భారీ షాట్ ఆడగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కౌషల్ బంతిని అందుకున్నట్లే అందుకొని చేజార్చాడు. అయితే వెంటనే తేరుకున్న అతడు ముందుకు దూకుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. ఆ తర్వాత ఐదు పరుగుల వ్యవధిలో మరో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 189 పరుగులకు ఆలౌటైంది. జాకబ్ బెతెల్ (2), కెప్టెన్ టామ్ ప్రెస్ట్ (0), విలియమ్ లక్స్టన్ (4), జార్జ్ బెల్ (0), రెహాన్ అహ్మద్ (10), అలెక్స్ హార్టన్ (10) ఎక్కువ సేపు నిలువ లేకపోయారు. భారత బౌలర్లలో కౌషల్ తంబేకు ఓ వికెట్ దక్కింది.
కష్టంగానే..
సులువైన లక్ష్యఛేదనలో భారత్కు మెరుగైన ఆరంభం లభించలేదు. లీగ్దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రఘువంశీ (0) డకౌట్ కాగా.. హర్నూర్ సింగ్ (21) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఈ దశలో కెప్టెన్ యష్ ధుల్ (17)తో కలిసి షేక్ రషీద్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అయితే మూడు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కాగా.. నిషాంత్ సింధు, రాజ్ బవా ఎలాంటి సంచలనాలకు అవకాశం ఇవ్వలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 44.5 ఓవర్లలో 189 ఆలౌట్ (జేమ్స్ రెవ్ 95; రాజ్ బవా 5/31, రవికుమార్ 4/34), భారత్: 47.4 ఓవర్లలో 195/6 (రషీద్ 50, సింధు 50 నాటౌట్; బొయెడెన్ 2/24).