న్యూఢిల్లీ: భారత హాకీ స్టార్ రాణిరాంపాల్కు అరుదైన గౌరవం దక్కింది. తన అద్భుత ఆటతీరుతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన రాణికి తగిన గుర్తింపు లభించింది. దేశంలో ఒక స్టేడియానికి మహిళా ప్లేయర్ పేరుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలోని ఎమ్సీఎఫ్ హాకీ స్టేడియానికి ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్’ అని పేరు పెట్టారు. మంగళవారం జరిగిన స్టేడియం నామకరణ కార్యక్రమానికి రాణి ముఖ్య అతిథిగా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ సీనియర్ ప్లేయర్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా రాణి మాట్లాడుతూ ‘దేశ హాకీకి నేను చేసిన సేవలకు గుర్తింపు లభించింది.
రాయ్బరేలీలో హాకీ స్టేడియానికి నా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఒక స్టేడియానికి మహిళా ప్లేయర్ పేరు పెట్టడం, అది నాకు దక్కడం గర్వంగా ఉంది. ఇది చిరస్మరణీయ సందర్భం. ఈ సందర్భాన్ని భారత మహిళల హాకీ జట్టుకు అంకితమిస్తున్నాను. దీని ద్వారా భవిష్యత్లో మరింత మంది అమ్మాయిలు హాకీని కెరీర్గా ఎంచుకోవాలి’ అని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే టోక్యో ఒలింపిక్స్ తర్వాత గాయపడ్డ 28 ఏండ్ల రాణి ఈ మధ్యే పూర్తి ఫిట్నెస్తో జట్టులోకి వచ్చింది. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ద్వారా రీఎంట్రీ చేసింది.