Ramiz Raja : న్యూజిలాండ్పై రెండో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ప్రశంసించాడు. సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అతను అన్నాడు. స్వదేశంలో ఎలా ఆడాలి? అనేది ఉపఖండ జట్లు, ముఖ్యంగా పాకిస్థాన్, భారత జట్టును చూసి నేర్చుకోవాలని అతను అభిప్రాయపడ్డాడు. ‘భారత జట్టుతో పోలిస్తే సొంతగడ్డపై పాకిస్థాన్ టీమ్ ప్రదర్శన నిలకడగా లేదు. స్వదేశంలోని పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం భారత్కు కలిసొచ్చిన విషయం. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ముందర ఆ జట్టుకు ముఖ్యమైన మైలురాయి’ అని రమీజ్ రాజా అన్నాడు. ఆ దేశ మాజీ బౌలర్ డానిష్ కనేరియా కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్వదేశంలోని పరిస్థితులను అవకాశంగా ఎలా మలచుకోవాలో భారత్ను చూసి పాక్ నేర్చుకోవాలని అతను అన్నాడు.
15 సిరీస్లు కైవసం
భారత జట్టు 2019 వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో 19 వన్డే సిరీస్లు ఆడింది. వాటిల్లో రికార్డు స్థాయిలో 15 సిరీస్లను సొంతం చేసుకుంది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్లో ఓటముల అనంతరం ఇండియా పుంజుకుంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలో టీ20 సిరీస్ గెలిచింది. స్వదేశంలో శ్రీలంకను చిత్తు చేసి టీ20, వన్డే సిరీస్ అందుకుంది. న్యూజిలాండ్ను కూడా రెండు వన్డేల్లో ఓడించి సిరీస్ దక్కించుకుంది. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్లో అదరగొడుతున్నారు. సిరాజ్, షమీ, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. దాంతో, భారత్ వరస విజయాలు సాధిస్తోంది.