ఇస్లామాబాద్ : పాక్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు రమీజ్ రాజా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తున్నది. మాజీ ప్రధాని ఇమ్రాన్కు అత్యంత సన్నిహితుడైన రమీజ్ రాజీనామా చేయనున్నట్లు డైలీ జంగ్ పేర్కొంది. ఈ విషయంలో రమీజ్ రాజా తన సన్నిహితులను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది.
దుబాయిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో సమావేశం తర్వాత రాజీనామా ప్రకటించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఐసీసీతో చర్చల కోసం రమీజ్ ప్రస్తుతం దుబాయిలో ఉండగా.. సమావేశం ఇవాళ ముగియనున్నది. ఇదిలా ఉండగా.. వచ్చే వారం (11వ తేదీ నుంచి) పీసీబీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయ క్రికెట్లో మార్పులు తేవడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.