బెంగళూరుపై రాజస్థాన్ గెలుపు
మెరిసిన పరాగ్, కుల్దీప్సేన్, అశ్విన్
బట్లర్ బాదకున్నా.. బౌల్ట్ బెంబేలెత్తించకపోయినా.. రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. ప్రధాన ఆటగాళ్లంతా విఫలమైన చోట రియాన్ పరాగ్ బ్యాట్తో సత్తాచాటి జట్టుకు పోరాడే స్కోరు అందిస్తే.. బంతితో కుల్దీప్సేన్, అశ్విన్ మాయ చేశారు! ఫలితంగా ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకున్న రాజస్థాన్.. ఓవరాల్గా ఆరో గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లింది. గత మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో 68 పరుగులకే ఆలౌటైన బెంగళూరు.. ఈసారి 145 పరుగుల లక్ష్యఛేదనలో చతికిలబడింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్ అవతారమెత్తినా.. ఫామ్ అందుకోలేకపోవడం అతడి అభిమానులను మరింత బాధించింది!
పుణే: గత మ్యాచ్లో సన్రైజర్స్ బౌలింగ్ దెబ్బకు సీజన్లోనే అతి తక్కువ స్కోరుకు పరిమితమైన బెంగళూరు.. వరుసగా రెండో మ్యాచ్లోనూ ప్రభావం చూపలేకపోయింది. బౌలర్లు రాణించి ప్రత్యర్థిని కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యంతో మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 29 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయంతో రన్రేట్ మెరుగు పర్చుకున్న రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లంతా పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చోట.. యువ ఆటగాడు రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, జోష్ హజిల్వుడ్, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
తాజా సీజన్లో మూడు సెంచరీలతో ఫుల్ జోష్లో ఉన్న బట్లర్.. ఈసారి 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. దేవదత్ పడిక్కల్ (7) విఫలమయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (9 బంతుల్లో 17; 4 ఫోర్లు) ఎడాపెడా ఫోర్లు బాదగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (27) మూడు సిక్సర్లు కొట్టినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అవతారమెత్తిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) మరోసారి నిరాశ పర్చగా.. డుప్లెసిస్ (23), రజత్ పాటిదార్ (16) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్వెల్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగితే.. ప్రభుదేశాయ్ (2) ప్రభావం చూపలేకపోయాడు. షాబాజ్ అహ్మద్ (17) తప్పిదానికి దినేశ్ కార్తీక్ (6) రనౌట్గా వెనుదిరగడంతో బెంగళూరు ఆశలు వదిలేసుకుంది. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్సేన్ 4, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు. పరాగ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా బుధవారం గుజరాత్తో హైదరాబాద్ తలపడనుంది.