ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్లు హ్యాట్రిక్ కొట్టాయి. రాజస్థాన్ విజయాల్లో ఈ ఘనత సాధిస్తే ముంబై ఓటముల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ ఓడింది. ఐపీఎల్లో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా 250వ మ్యాచ్ను ఆడిన ముంబై.. హోంగ్రౌండ్లో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పదునైన పేస్కు టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టగా.. బర్గర్, చాహల్లు ముంబై పనిపట్టారు. 14 మ్యాచ్లు ముగిసిన ఈ సీజన్లో ఆర్సీబీ తర్వాత ఆతిథ్య జట్టు ఓడటం ఇది రెండోసారి. ముంబై: ఐపీఎల్-17లో నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓడింది.
IPL | సొంత ఇలాఖా వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా చిత్తుగా ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది. ట్రెంట్ బౌల్ట్ (3/22) పేస్ పదునుకు తోడు యుజ్వేంద్ర చాహల్ (3/11) స్పిన్ మాయకు ముంబై కుదేలైంది. ఎంఐ సారథి హార్దిక్ (21 బంతుల్లో 34, 6 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 32, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. ఛేదనలో రాజస్థాన్15.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రియాన్ పరాగ్ (39 బంతుల్లో 54 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రెంట్ బౌల్ట్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్ ఆరంభమై ప్రేక్షకులింకా తమ సీట్లలో కూర్చోకముందే ముంబైకి బౌల్ట్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో రోహిత్ శర్మ, నమన్ ధీర్లను ఔట్ చేసి ప్రారంభంలోనే ఆ జట్టును దెబ్బతీశాడు. పవర్ ప్లేలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ అయిన బౌల్ట్ వేసిన ఐదో బంతి రోహిత్ బ్యాట్ ఎడ్జ్కు తాకగా శాంసన్ సూపర్ డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. మరుసటి బంతికే ధీర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన మరుసటి ఓవర్లో బౌల్ట్.. బ్రెవిస్ను ఔట్ చేసి ముంబైని కోలుకోనీయలేదు. రోహిత్, ధీర్, బ్రెవిస్లు సున్నాలు చుట్టడం గమనార్హం. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబైకి బర్గర్ మరో షాకిచ్చాడు. నాలుగో ఓవర్లో అతడు.. ఇషాన్ కిషన్ (16) ను పెవిలియన్కు పంపడంతో ఆ జట్టు కష్టాలు రెట్టింపయ్యాయి.
3.3 ఓవర్లకు ముంబై 4 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసిన ముంబైని కెప్టెన్ హార్దిక్, తిలక్ వర్మలు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 36 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. బర్గర్ వేసిన 6వ ఓవర్లో హార్దిక్ మూడు బౌండరీలు కొట్టగా… అవేశ్ ఖాన్ బౌలింగ్లో తిలక్వర్మ ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ బాదడంతో ముంబై స్కోరు వేగం పుంజుకుంది. ఈ ఇద్దరూ కుదురుకుంటున్న దశలో చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ముంబైని చుట్టేశాడు. పదో ఓవర్లో హార్దిక్ను ఔట్ చేసిన అతడు తర్వాత తిలక్ వర్మ, కొయెట్జిలనూ పెవిలియన్కు పంపాడు. పడుతూ లేస్తూ వచ్చిన ముంబైని వంద పరుగులు దాటించిన టిమ్ డేవిడ్ (17)ను బర్గర్ ఔట్ చేశాడు.
ఛేదనలో రాజస్థాన్ ఆరంభంలో తడబడ్డా తర్వాత నిలకడగా ఆడింది. ఈ సీజన్లో తేలిపోతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (10), ముంబైపై మంచి రికార్డు ఉన్న జోస్ బట్లర్ (13), కెప్టెన్ సంజూ శాంసన్ (12)లు విఫలమయ్యారు. కానీ రియాన్ పరాగ్ తన ఫామ్ను కొనసాగిస్తూ ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. అశ్విన్ (16)తో కలిసి నాలుగో వికెట్ కు 40 పరుగులు జోడించిన పరాగ్.. శుభమ్ దూబేతో అజేయంగా 39 పరుగులు జతచేశాడు. ఈ సీజన్లో పరాగ్కు ఇది వరుసగా రెండో అర్ధసెంచరీ.
17 ఐపీఎల్లో డకౌట్ అవడం రోహిత్కు ఇది 17వ సారి. దినేశ్ కార్తీక్ను హిట్మ్యాన్ సమం చేశాడు.
ముంబై: 20 ఓవర్లలో 125/9 (హార్దిక్ 34, తిలక్ 32, చాహల్ 3/11, బౌల్ట్ 3/22)
రాజస్థాన్: 15.3 ఓవర్లలో 127/4 (పరాగ్ 54 నాటౌట్, అశ్విన్ 16, మధ్వాల్ 3/20, మఫక 1/23)