ముల్లాన్పూర్: ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా సాగిన పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. వరుస విజయాలతో జోరుమీదున్న కింగ్స్కు అడ్డుకట్ట వేసి సీజన్లో తొలి పరాభవాన్ని రుచి చూపించింది. ఇరుజట్ల మధ్య ముల్లాన్పూర్లో జరిగిన హైస్కోరింగ్ గేమ్లో కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి శ్రేయాస్ సేన జైత్రయాత్రకు బ్రేకులు వేసింది. ఛేదనలో డొనొవన్ ఫెరీరా (26 బంతుల్లో 52 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్స్లు), యశస్వీ జైస్వాల్ (27 బంతుల్లో 51, 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో పాటు వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 43, 3 ఫోర్లు, 5 సిక్స్లు) ధనాధన్ ఆటతో ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మొదట మార్కస్ స్టోయినిస్ (22 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్స్లు) వీరవిహారానికి తోడు ప్రభ్సిమ్రన్ సింగ్ (44 బంతుల్లో 59, 6 ఫోర్లు, 1 సిక్స్) నిలకడైన అర్ధ శతకంతో కింగ్స్ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
రాయల్స్ తగ్గలె..
ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్ ఎప్పట్లాగే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. అర్ష్దీప్ బౌలింగ్లో తానెదుర్కున్న మూడో బంతిని సిక్స్గా మలిచి విధ్వంసానికి శ్రీకారం చుట్టిన అతడు.. ఆ తర్వాత రెండు ఫోర్లు బాదాడు. ఫెర్గూసన్ ఓవర్లోనూ ఫోర్, రెండు సిక్స్లు దంచాడు. అర్ధ శతకానికి చేరువవుతున్న అతడు.. అర్ష్దీప్ నాలుగో ఓవర్లో రోండో బంతిని తప్పుగా అంచనావేసి మిడాఫ్ వద్ద శ్రేయాస్కు క్యాచ్ ఇచ్చాడు. అతడు నిష్క్రమించినా బాదే బాధ్యతను జైస్వాల్ భుజానికెత్తుకుని అదే ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో జోరు చూపించాడు. అయితే పవర్ ప్లేలో ధాటిగా ఆడిన ఆ జట్టు స్కోరు స్పిన్నర్ల రాకతో నెమ్మదించింది. బ్రర్, జైస్వాల్ పరుగులను కట్టడి చేశారు. చాహల్ వరుస ఓవర్లలో జురెల్ (16), జైస్వాల్, కెప్టెన్ పరాగ్ (29)ను వెనక్కి పంపాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా ఫెరీరా, ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ మెరుపులతో ఆ జట్టు పరుగుల వేటలో వెనుకబడలేదు. చివరి 3 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 35 రన్స్ అవసరమవగా ఫెరీరా మెరుపులతో కింగ్స్కు ఓటమి ఖాయమైంది.
టాపార్డర్ మెరిసినా..
ఈ సీజన్లో ఫుల్ స్వింగ్లో ఉన్న ఓపెనింగ్ జోడీల్లో ఒకటైన ప్రభాన్ష్ (ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్) ద్వయంతో పాటు టాపార్డర్ దూకుడుగా ఆడటంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ మొదలవగానే బర్గర్ రెండో ఓవర్లో ప్రియాన్ష్.. 4, 6, 4, 4 తో 21 పరుగులు పిండుకున్నాడు. ఆర్చర్ ఓవర్లోనూ అతడు రెండు బౌండరీలు కొట్టినా.. ఐదో బంతికి మిడాఫ్ వద్ద బర్గర్ చేతికి చిక్కడంతో కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. మూడోస్థానంలో వచ్చిన కనోలి (14 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడును కొనసాగించడంతో పవర్ప్లేలో ఆ జట్టు వికెట్ నష్టానికి 65 రన్స్ చేసింది. యశ్రాజ్ విసిరిన ఏడో ఓవర్లో రెండు సిక్స్లు బాదిన కనోలిని అతడే తన తర్వాతి ఓవర్లో పెవిలియన్కు చేర్చడంతో కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడిన ప్రభ్సిమ్రన్ ఆర్చర్ ఓవర్లో రెండు ఫోర్లతో 35 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ సీజన్లో అతడికి ఇది నాలుగో ఫిఫ్టీ. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడిని యశ్రాజ్ ఔట్ చేయడంతో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్.. తొలుత శ్రేయాస్ తర్వాత సుయాన్ష్ అండగా కింగ్స్కు భారీ స్కోరును అందించాడు. బర్గర్ ఓవర్లో ఫోర్, సిక్స్తో జోరు పెంచిన స్టోయినిస్.. ఆర్చర్ ఓవర్లోనూ రెండుసార్లు బంతిని స్టాండ్స్లోకి పంపాడు. బ్రిజేశ్ ఆఖరి ఓవర్లోనూ 4, 6, 6, 4, 4తో 24 రన్స్ రాబట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లకు 222/4 (స్టోయినిస్ 62*, ప్రభ్సిమ్రన్ 59, యశ్రాజ్ 2/41, ఆర్చర్ 1/40); రాజస్థాన్: 19.2 ఓవర్లకు 228/4 (ఫెరీరా 52*, జైస్వాల్ 51, చాహల్ 3/36, అర్ష్దీప్ 1/68)