బరిలోకి దిగిన తొలి సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. నిలకడైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్కు చేరిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్లో రాజస్థాన్ను చిత్తు చేసి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో రాజస్థాన్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా.. ఛేదనలో టాపార్డర్ దంచికొట్టడంతో టైటాన్స్ విజయం వైపు నిలిచింది. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం కాగా.. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తొలి మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచిన మిల్లర్.. టైటాన్స్ను గెలిపించాడు.
కోల్కతా: ఐపీఎల్ అరంగేట్రం సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో చక్కటి ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్కు చేరిన గుజరాత్.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో రాయల్స్కు కళ్లెం వేసిన టైటాన్స్.. ఆనక ఓ మాదిరి లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆదివారం జరుగనున్న తుదిపోరులో క్వాలిఫయర్-2 విజేతతో గుజరాత్ టైటిల్ కోసం తలపడనుండగా.. ఎలిమినేటర్ విజేతతో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (56 బంతుల్లో 89; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. దేవదత్ పడిక్కల్ (28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా ఆడగా.. యశస్వి జైస్వాల్ (3), షిమ్రాన్ హెట్మైర్ (4), రియాన్ పరాగ్ (4) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యష్ దయాల్, సాయికిషోర్, హార్దిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) శుభమన్ గిల్ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, ఒక సిక్సర్), మాథ్యూ వేడ్ (30 బంతుల్లో 35; 6 ఫోర్లు) రాణించగా.. డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. పాండ్యా, మిల్లర్ నాలుగో వికెట్కు అజేయంగా 106 పరుగులు జోడించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్కాయ్ చెరో వికెట్ పడగొట్టారు. మిల్లర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరుగనున్న ఎలిమినేటర్ పోరులో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
లీగ్ దశలో మూడు సెంచరీలతో అదరగొట్టిన బట్లర్ కీలక పోరులో మరోసారి మెరువడంతో రాజస్థాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది. షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో బట్లర్ రెండు ఫోర్లు బాదగా.. రెండో ఓవర్లో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ను యష్ దయాల్ ఔట్ చేశాడు. క్రీజులో అసౌకర్యంగా కదిలిన జైస్వాల్.. కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అక్కడి నుంచి రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ జోరు మొదలైంది. ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన శాంసన్.. షమీ వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లు అరుసుకున్నాడు.
అల్జారీ జోసెఫ్కు రెండు భారీ సిక్సర్లు రుచి చూపడంతో పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. సాయికిషోర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శాంసన్.. అతడి తదుపరి ఓవర్లో జోసెఫ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బట్లర్ క్రీజులో ఉన్నా.. రషీద్ ఖాన్ (4 ఓవర్లలో 15 పరుగులు) బౌలింగ్లో పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. సాయికిషోర్ ఓవర్లో 6,4,4 కొట్టిన పడిక్కల్ ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఆఖర్లో బట్లర్ గేర్ మార్చాడు.
యష్ దయాల్ వేసిన 17వ ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన బట్లర్.. అల్జారీ జోసెఫ్కు మూడు ఫోర్లు రుచి చూపించాడు. షమీ ఓవర్లో 4,6 కొట్టిన బట్లర్.. ఆఖరి ఓవర్లో మరో సిక్స్ అందుకోవడంతో రాయల్స్ మంచి స్కోరు చేసింది. ఎదుర్కొన్న తొలి 38 బంతుల్లో 39 పరుగులే చేసిన బట్లర్.. చివరి 18 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం కొసమెరుపు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 188/6 (బట్లర్ 89, శాంసన్ 47; హార్దిక్ 1/14, షమీ 1/43), గుజరాత్: 19.3 ఓవర్లలో 191/3 (మిల్లర్ 68 నాటౌట్, హార్దిక్ 40 నాటౌట్; బౌల్ట్ 1/38).