ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ టేబుల్లో చివరి స్థానాన్ని ఇప్పుడు మరో టీమ్ ఆక్రమించింది. ఆ టీమ్ పేరు రాజస్థాన్ రాయల్స్. గురువారం ముంబైలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిన రాయల్స్ టీమ్.. టేబుల్లో చివరి స్థానానికి దిగజారింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిన రాయల్స్.. కేవలం 2 పాయింట్లతో అట్టడుగున ఉంది.
దీంతో బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన తర్వాత రాయల్స్ టీమ్ తమను తామే ట్రోల్ చేసుకుంది. ఎలాంటి కామెంట్ లేకుండా జస్ట్ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అందులో డైరెక్టెడ్ బై రాబర్ట్ బి వీడ్ అని రాసి ఉంది. ఇది చాలా మందికి తెలియని మీమ్ కావచ్చు కానీ ఇందులో చాలా అర్థమే ఉంది. సాధారణంగా ఈ టైటిల్ను ఏదైనా ఫన్నీ వీడియో దారుణమైన ముగింపు చూసినప్పుడు వేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఘోరమైన వైఫల్యానికి ఈ మీమ్ను వాడతారు.
తమను తామే ఇలా ట్రోల్ చేసుకోవడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ టీమ్ తమ దారుణమైన వైఫల్యాన్ని చెప్పకనే చెప్పడం విశేషం. ఈ ట్వీట్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. గంటల్లోనే వేల కొద్దీ లైక్స్, వందల కామెంట్లు సొంతం చేసుకుంది.