Raja Rithvik | నాసిక్: తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ రాజారిత్విక్ వరుస టైటిళ్ల జోరు కొనసాగుతున్నది. జాతీయ చెస్ చాంపియన్షిప్లో ఇప్పటికే కాంస్యం(ర్యాపిడ్) సొంతం చేసుకున్న రిత్విక్ తాజాగా బ్లిట్జ్ విభాగంలో రజతం ఒడిసిపట్టుకున్నాడు. గురువారంతో ముగిసిన టోర్నీలో రిత్విక్..మొత్తం 11 రౌండ్లలో 9 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో నిలిచాడు.
దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 224 మంది టాప్ చెస్ ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. మొత్తం టోర్నీలో ఏడు గేముల్లో గెలిచిన ఈ యువ జీఎం నాలుగు గేమ్లను డ్రా చేసుకున్నాడు. జీఎం ఘోష్ దిప్తాత్యాన్(9.5) స్వర్ణం దక్కించుకోగా, ఎఫ్ఎం వాచ్ ఇథాన్(9) కాంస్యం కైవసం చేసుకున్నాడు. జాతీయ చెస్ చాంపియన్షిప్లో రెండు పతకాలు సాధించిన రిత్విక్ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ అభినందించారు.