భారత జట్టులో ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఆటగాడు కేఎల్ రాహుల్. అదే సమయంలో అత్యంత ఘోరమైన ఫామ్లో ఉన్న ఆటగాడు అజింక్య రహానే. కానీ వాండరర్స్ టెస్టులో రాహుల్ బదులు రహానేను సెలెక్ట్ చేయాల్సిందని మాజీ ఆటగాడు వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
కాకపోతే ఆటగాడిగా కాదులెండి, కెప్టెన్గా. సౌతాఫ్రికా సిరీస్లో భాగంగా జరిగిన రెండో టెస్టులో భారత్కు రాహుల్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీకి వెన్నునొప్పి రావడంతో రాహుల్కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్కు రాహుల్ ఒక్కసారి కూడా నాయకత్వం వహించలేదు.
కానీ తన కెప్టెన్సీ అరంగేట్రమే టెస్టుల్లో చేశాడు. భారత జట్టులో గత 30 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని రాహుల్ అందిపుచ్చుకోలేకపోయాడు. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్సులో అతని ఫీల్డింగ్ వ్యూహాలను కూడా మాజీలు తప్పుబట్టారు.
సులభంగా సింగిల్స్, డబుల్స్ తీసే అవకాశం లభించడంతో సఫారీలు నెమ్మదిగా లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్గా కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు ఎన్నో మధురమైన విజయాలు అందించిన రహానేను పక్కనపెట్టి, రాహుల్కు అవకాశం ఇవ్వడంపై వసీం జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కోహ్లీ లేకపోయినా ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం అందించిన రహానే ఉండగా రాహుల్ను ఎందుకు కెప్టెన్ చేశారు? ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ను అర్థం చేసుకోలేకపోతున్నా అంటూ అసహనం వ్యక్తం చేశాడీ మాజీ ఓపెనర్. తాను రాహుల్కు వ్యతిరేకమేమీ కాదని, కానీ కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు రహానే నాయకత్వం వహించాల్సిందని స్పష్టంచేశాడు.
అయితే, ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ తర్వాతి నుంచే మైదానంలో కోహ్లీ ఎనర్జీ లేని లోటు కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఫీల్డింగ్, బౌలింగ్ వ్యూహాల్లో కూడా పదును కనిపించలేదని పేర్కొన్నారు.