హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఐదు పతకాలు గెలుచుకున్నారు. నెదర్లాండ్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 65 దేశాల అగ్నిమాపక, లా ఎన్ఫోర్స్మెంట్, బాడర్ ప్రొటెక్షన్, ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ రంగాలకు చెందిన అధికారులు 65కు పైగా క్రీడల్లో పోటీ పడ్డారు. సుమారు వెయ్యి మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో తెలంగాణ పోలీసులు ఐదు పతకాలు కైవసం చేసుకున్నారు. రాచకొండ రోడ్ సెఫ్టీ డీసీపీ శ్రీబాల.. టేబుల్ టెన్నిస్ (టీటీ) ఉమెన్స్ సింగిల్స్లో రజతం, డబుల్స్లో కాంస్యం చేజిక్కించుకోగా.. రాచకొండ ఏఆర్పీసీ డి.సంజీవ్ కుమార్ తైక్వాండో (58 కిలోలు)లో రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. తైక్వాండో 80 కేజీల విభాగంలో కానిస్టేబుల్ డి.గోపాలకృష్ణయ్య కాంస్య పతకం సాధించారు. మొత్తం తెలంగాణకు ఐదు పతకాలు రాగా అందులో నాలుగు పతకాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అధికారులకే దక్కాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అధికారులను ప్రోత్సహించి క్రీడల్లో పాల్గొనేందుకు సహకరించిన తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.