PV Sindhu : రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు గడిచిన రెండేళ్లుగా టైటిల్ పోరులో నిరాశే ఎదురవుతోంది. తాజాగా మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో కూడా సింధుకు నిరాశే మిగిలింది. చైనా షట్లర్ వాంగ్ జీయీ చేతిలో సింధు 21-16, 5-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది. తొలి సెట్లో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన సింధు.. ఆ తర్వాత రెండో, మూడో సెట్లలో చతికిలపడింది.
ముఖ్యంగా రెండో సెట్లో 5-21 పాయింట్ల భారీ వ్యత్యాసంతో వెనుకబడింది. సింధు తప్పిదాలను వాంగ్ జీయీ చక్కగా ఉపయోగించుకుంది. తొలి సెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన సింధు.. రెండో సెట్లో అదే ఊపును కొనసాగించలేకపోయింది. ఇక మూడో సెట్ను సింధు దూకుడుగా ఆరంభించినా తర్వాత వాంగ్ జీయీ అద్భుత రీతిలో పుంజుకుంది.
వాంగ్ జీయీ చక్కటి ప్లేస్మెంట్లు, షాట్లతో రెండు, మూడో సెట్లను సొంతం చేసుకుంది. దాంతో మరో రెండు నెలల్లో ఆరంభంకానున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు మలేసియా మాస్టర్స్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని భావించిన సింధుకు నిరాశే మిగిలింది.