బాలి (ఇండోనేషియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో రజత పతకం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ సింధు 16-21, 12-21తో కొరియా యువ సంచలనం అన్ సెయాంగ్ చేతిలో ఓటమి పాలైంది. 40 నిమిషాల్లో ముగిసిన తుదిపోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్ సెయాంగ్కు సింధు పోటీనివ్వలేకపోయింది. కొరియా ప్లేయర్ స్మాష్లకు బదులు చెప్పలేక వరుస గేమ్ల్లో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. కోర్టును పూర్తిగా వినియోగించుకుంటూ సెయాంగ్ సూపర్ స్మాష్లతో విరుచుకుపడితే.. సింధు వాటికి తగిన బదులివ్వడంలో విఫలమైంది. సెయాంగ్తో సింధుకు ఇది మూడో మ్యాచ్కాగా.. మూడింట్లోనూ వరుస గేమ్ల్లోనే ఓటమి పాలవడం గమనార్హం! ఈ విజయంతో సీజన్ ముగింపు టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి దక్షిణ కొరియా షట్లర్గా 19 ఏండ్ల సెయాంగ్ రికార్డుల్లోకెక్కింది. ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్ నెగ్గి జోరుమీదున్న సెయాంగ్.. వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్తో బాలిలో ‘హ్యాట్రిక్’నమోదు చేసుకుంది. వరల్డ్ టూర్ ఫైనల్స్లో మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించిన 26 ఏండ్ల సింధు.. సెయాంగ్తో పోరులో ఆకట్టుకోలేకపోయింది. ఈ నెల 12 నుంచి స్పెయిన్ వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచ చాంపియన్షిప్లో సింధు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.
సెయాంగ్ చాలా బాగా ఆడింది. ఆమెతో పోరు అంత సులువు కాదని ముందే ఊహించా. ర్యాలీ సమయంలో కొన్ని పొరపాట్లు చేశా. ఫలితం నిరాశ పరిచినా.. గత మూడు వారాలుగా ఆటలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సెయాంగ్కు ఆరంభంలోనే పైచేయి సాధించే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించా. అయినా కీలక సమయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన కొరియా ప్లేయర్ చివరి వరకు అదే జోరు కొనసాగించి మ్యాచ్ను లాగేసుకుంది. ఈ పరాజయాన్ని పక్కనపెట్టి ప్రపంచ చాంపియన్షిప్కు సిద్ధమవుతా. -పీవీ సింధు