ఒడెన్సే : భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో ఎదురన్నదే లేకుండా పోయింది. ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న సింధు.. శుక్రవారం సుపనిందా కటెథోంగ్(థాయ్లాండ్)పై అద్భుత విజయంతో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి సెట్ నుంచే విరుచుకు పడిన సింధు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. రెండో సెట్లో మరింత దూకుడుగా ఆడి కేవలం 47 నిమిషాల్లోనే 21-19, 21-12 పాయింట్ల తేడాతో మ్యాచ్ ముగించింది. వారం క్రితమే ఆర్కిటిక్ ఓపెన్లో సెమీస్ చేరిన సింధు.. డెన్మార్క్ ఓపెన్లోనూ ఫైనల్ పోరుకు అడుగు దూరంలో నిలవడం విశేషం. ఫైనల్ బెర్తు కోసం కరోలినా మరిన్(స్పెయిన్), థాయ్జూయింగ్(చైనీస్ తైపీ) మ్యాచ్ విజేతతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది.