పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి. కీలకమైన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో పంజాబ్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు కెప్టెన్ కోహ్లీ (25), దేవ్దత్ పడిక్కల్ (40) శుభారంభం అందించారు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ (57) మెరుపులతో బెంగళూరు జట్టు మంచి స్కోరు సాధించింది. డివిలియర్స్ (23) ఫర్వాలేదనిపించినా దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు.
చివరకు 20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ ౩, హెన్రిక్స్ ౩ వికెట్లు కూల్చారు. లక్ష్య ఛేదనలో పంజాబ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (39), మయాంక్ అగర్వాల్ (57) జట్టుకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఒక దశలో 10 ఓవర్లు 80 పరుగులతో పంజాబ్ జట్టు గెలుపు ఖాయమనే స్థితిలో నిలిచింది. ఈ పరిస్థితిలో రాహుల్ను అవుట్ చేసిన షాబాజ్ అహ్మద్ బెంగళూరు జట్టుకు బ్రేక్ ఇచ్చాడు.
ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (3), సర్ఫరాజ్ ఖాన్ (0) తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఆల్డెన్ మార్క్రమ్ (20), షారుఖ్ ఖాన్ (16) కాసేపు ఆశలు రేపినా అవి ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి 7 పరుగుల దూరంలో చతికిలపడింది. బెంగళూరు బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ ౩ వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.