న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో దేశానికి రెండు పతకాలు సాధించి పెట్టిన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. టోక్యో ఒలింపిక్స్కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. సాయి ప్రణీత్ వ్యక్తిగత కోచ్ అగుస్ సాంటొసాకు అవకాశం ఇచ్చేందుకు గోపీచంద్ తప్పుకున్నట్లు సమాచారం. ‘ఒక కోటా మాత్రమే అందుబాటులో ఉంది. సాయప్రణీత్ వెంట కోచ్ సాంటొసా వెళ్లడం కోసం గోపీచంద్ టోక్యో ఒలింపిక్స్కు దూరమయ్యారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి అజయ్ సింఘానియా మంగళవారం తెలిపారు. టోక్యో విశ్వక్రీడలకు వెళ్లే షట్లర్లతో పాటు ఐదుగురు సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించగా.. అందులో ఇద్దరు ఫిజియోలు సుమాన్ష్ సివలంక, ఎవాంగ్లైన్తో పాటు.. సింధు కోచ్ తై సాంగ్ పార్క్ (కొరియా), చిరాగ్శెట్టి-సాత్విక్ సాయిరాజ్ కోచ్ మాథియాస్ బోయ్ (డెన్మార్క్), సాయిప్రణీత్ కోచ్ అగుస్ సాంటొసా (ఇండోనేషియా) ఉన్నారు. షట్లర్లతో పాటు ఏడుగురు సహాయ సిబ్బందిని అనుమతించాలని బాయ్ గత నెలలో ఐవోఏను కోరినా.. కరోనా నేపథ్యంలో ఐదుగురికి మాత్రమే అనుమతి లభించింది.