ముంబై : మట్టిలోని మాణిక్యాలను వెలికితీసిన ప్రో కబడ్డీ లీగ్ మరో సీజన్కు సిద్ధమవుతోంది. తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ లీగ్.. 10వ సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. పీకేఎల్ నిర్వాహకులు గురువారం ముంబైలో పదో సీజన్ షెడ్యూల్ విడుదల చేశారు. డిసెంబర్ 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు లీగ్ జరుగనుండగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆరంభ పోరులో తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.
ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. 12 పట్టణాల్లో పీకేఎల్ పోటీలను నిర్వహించనున్నారు. గుజరాత్ (డిసెంబర్ 2-7), బెంగళూరు (డిసెంబర్ 8 నుంచి 13), పుణె (డిసెంబర్ 15-20), చెన్నై (డిసెంబర్ 20-27), నోయిడా (డిసెంబర్ 29 – జనవరి 3), ముంబై (జనవరి 5-10), జైపూర్ (జనవరి 12- 17), హైదరాబాద్ (జనవరి 19-24), పట్నా (జనవరి 26-31), ఢిల్లీ (ఫిబ్రవరి 2-7), కోల్కతా (ఫిబ్రవరి 9- 14), పెంచ్కుల (ఫిబ్రవరి16-21) సిటీలు పీకేఎల్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.