Prithvi Shah : సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 రేపు అహ్మదాబాద్లో జరగనుంది. టైటిల్ పోరులో పై చేయి ఎవరు సాధిస్తారో ని నరేంద్ర మోదీ స్టేడియంలో తేలిపోనుంది. అయితే.. ఓపెనర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. వీళ్లిద్దరూ రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యారు. దాంతో, ఇషాన్కు జోడీగా పృథ్వీ షాను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డేల్లో దుమ్మురేపిన గిల్ టీ20ల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దాంతో, ఇండోర్, లక్నోలో జరిగిన మ్యాచుల్లో కివీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో గిల్, ఇషాన్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు శుభారంభం ఇవ్వకపోవడంతో మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పడుతోంది.
అస్సాంపై ట్రిపుల్ సెంచరీ
రంజీల్లో అస్సాంపై ట్రిపుల్ సెంచరీ(379) బాదిన ముంబై ఓపెనర్ పృథ్వీ షా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీలో అద్భుత ఇన్నింగ్స్లు ఆడిన అతడిని మూడేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపిక చేశారు. దాంతో జాతీయ జట్టు తరఫున అతను పరుగుల వరద పారిస్తాడని అంతా అనుకున్నారు. అయితే.. తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమతం అయ్యాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న గిల్వైపే కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొగ్గు చూపడమే అందుకు కారణం. కానీ, గిల్ రెండు మ్యాచుల్లో 18 రన్స్ చేసి నిరాశపరిచాడు. ఇషాన్ కూడా 23 పరుగులకు పరిమితం అయ్యాడు. దాంతో ఇషాన్ ప్లేస్లో వికెట్ కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మకు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మూడో టీ20 రేపు సాయంత్రం ఏడు గంటలకు మొదలు కానుంది.