వార్సా: ఒలింపిక్స్లో మెడల్ గెలవాలన్నది ప్రతి అథ్లెట్ కల. దీనికోసం ఏళ్ల తరబడి కఠోరంగా శ్రమిస్తారు. మెడల్ గెలిచిన క్షణాన ప్రపంచాన్నే గెలిచినంత ఆనందపడతారు. అలాంటి మెడల్ను ఓ చిన్నారి ప్రాణం కోసం వేలం వేయాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి? పోలాండ్కు చెందిన జావెలిన్ త్రోయర్ మారియా ఆండ్రెజిక్కు అంతటి గొప్ప మనసు ఉంది కాబట్టే.. క్షణం ఆలోచించకుండా తాను గెలిచిన సిల్వర్ మెడల్ను వేలానికి పెట్టింది. మొన్న టోక్యో ఒలింపిక్స్లో ఆమె జావెలిన్ను 64.61 మీటర్ల దూరం విసిరి.. సిల్వర్ మెడల్ గెలిచింది.
అయితే అది గెలిచిన వారంలోపే తన దేశానికి చెందిన 8 నెలల చిన్నారి గుండె సర్జరీ కోసం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్బుక్ ద్వారా ప్రకటించింది. మలీసా అనే ఆ 8 నెలల చిన్నారి తన సర్జరీ కోసం పోలాండ్ నుంచి కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లాడు. ఆమె ఈ వేలం పోస్ట్ చేసిన వారం రోజుల తర్వాత గరిష్ఠంగా మెడల్కు 1.25 లక్షల డాలర్ల బిడ్ దాఖలైంది.
డబ్బూ, మెడల్ నీవే..
ఈ బిడ్ను పోలాండ్కు చెందిన సూపర్మార్కెట్ చెయిన్ జాబ్కా దాఖలు చేసింది. అయితే వేలంలో మెడల్ గెలుచుకున్నా.. దానిని తీసుకోవడానికి ఆ సంస్థ నిరాకరించింది. డబ్బుతోపాటు సిల్వర్ మెడల్ను కూడా మారియాకే తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు జాబ్కా చెప్పింది. నిజానికి మారియా కూడా క్యాన్సర్ను జయించిన ధీర వనితే. 2018లో ఆమెకు బోన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అయితే ఆ మహమ్మారిని జయించిన ఆమె.. ఇప్పుడు ఒలింపిక్స్లో పాల్గొని ఏకంగా సిల్వర్ మెడల్ గెలిచింది. రియో ఒలింపిక్స్లో 2 సెంటీమీటర్ల దూరంలో మెడల్ మిస్సయిన ఆమె.. ఇప్పుడు తన కలను సాకారం చేసుకుంది.