ముంబై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పోటీలకు వేళయైంది. బెంగళూరు వేదికగా డిసెంబర్ 21 నుంచి ఎనిమిదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి లీగ్ను ఒకే నగరానికి పరిమితం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ‘పీకేఎల్ నిర్వహణకు బెంగళూరులో సకల సదుపాయాలు ఉన్నాయి.. అన్ని విధాల అనువైన ప్రదేశం’ అని మాషల్ స్పోర్ట్స్ సీఈవో, వివో పీకేఎల్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపాడు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై లీగ్ నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేసి.. అన్ని విధాల సహకరిస్తామని చెప్పినట్లు గోస్వామి వివరించాడు. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా కరోనా నిబంధనలు పాటిస్తూ టోర్నీ నిర్వహిస్తామని తెలిపాడు. గతేడాది కొవిడ్-19 కారణంగా పీకేఎల్ నిర్వహించలేదు. ఆటగాళ్ల వేలంపాట ముంబైలో ఆగస్టు 29-31 మధ్య జరిగిన విషయం తెలిసిందే.