మెల్బోర్న్: చైనా టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షూయి కొన్నాళ్ల నుంచి ఆచూకీ లేని విషయం తెలిసిందే. ఓ ప్రముఖ నేత లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేసిన తర్వాత ఆ ప్లేయర్ అదృశ్యమైంది. దీంతో ఆమె ఎక్కడుందని టెన్నిస్ సంఘం చైనాను ప్రశ్నించింది. క్రీడాకారులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెల్బోర్న్లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో కొందరు ఫెంగ్ షూయి ఎక్కడ ఉందన్న నినాదాలతో బ్యానర్లను ప్రదర్శించారు. మరికొందరు టీషర్ట్లను కూడా వేసుకుని వచ్చారు. అయితే అలాంటి బ్యానర్లు, టీషర్ట్లు వేసుకురావద్దు అని ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ అధికారులు నిషేధం విధించారు. ఆ నిషేధంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇవాళ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. పెంగ్ షూయి ఎక్కడ అన్న టీషర్ట్లను అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ బ్యానర్ల ప్రదర్శనను మాత్రం నిషేధించారు. నిజానికి గత నవంబర్లో చైనా ఉన్నత రాజకీయవేత్తపై ఆరోపణలు చేసిన తర్వాత కొన్ని వారాల పాటు పెంగ్ కనిపించకుండాపోయింది. ఆ తర్వాత ఓ వీడియో కాల్ ద్వారా క్షేమంగా ఉన్నట్లు చెప్పింది.