ముంబై: మట్టి నుంచి మ్యాట్పైకి తెచ్చి.. గ్రామీణ క్రీడకు దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో నయా రికార్డులు నమోదయ్యాయి. 10వ సీజన్ కోసం జరిగిన వేలంలో భారత జట్టు కెప్టెన్ పవన్ షెరావత్ రికార్డు ధర పలికాడు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టు స్వర్ణం నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడగా.. తెలుగు టైటాన్స్ జట్టు రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో పీకేఎల్ చరిత్రలో అత్యంత ధర పలికిన ఆటగాడిగా పవన్ చరిత్రకెక్కాడు.
ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన వేలం ప్రక్రియలో మంగళవారం సీ, డీ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఇరాన్కు చెందిన మొహమ్మద్ రెజా రూ.2.35 కోట్లతో రెండో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యువ రైడర్ మన్దీప్ సింగ్ను రూ. 2.12 కోట్లతో బెంగాల్ వారియర్స్ సొతం చేసుకోగా.. ఉడుం పట్టుతో ప్రత్యర్థులను హడలెత్తించే స్టార్ డిఫెండర్ ఫజల్ అత్రాచలిని రూ.1.65 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. బాహుబలి సిద్దార్థ్ దేశాయ్ కోటి రూపాయలకు హర్యానా స్టీలర్స్ కొన్నది.