Pathum Nissanka | పల్లెకెలె: ఓపెనింగ్ బ్యాటర్ పాథుమ్ నిషాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. లంక తరఫున వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిషాంక చరిత్రకెక్కాడు. 2000లో టీమ్ఇండియాపై జయసూర్య చేసిన 189 స్కోరు రెండో స్థానానికి చేరింది.
తొలి బంతి నుంచే నిషాంక విజృంభించడంతో మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (88), సదీర సమరవిక్రమ (45) ఆకట్టుకున్నారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ కూడా ఆకట్టుకుంది. భారీ టార్గెట్ కండ్ల ముందు ఉన్నా.. ఏమాత్రం అదరక బెదరక తుదికంటా పోరాడి 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (115 బంతుల్లో 149 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు), మహమ్మద్ నబీ (136; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అసాధారణ పోరాటం కనబర్చారు. లంక బౌలర్లలో ప్రమోద్ 4 వికెట్లు తీశాడు.