ముంబై: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ ఓ అరుదైన క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో చెన్నై విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు ఛేదించేంత పని చేశాడు కమిన్స్. అయితే చివర్లో అతనికి సహకరించే వాళ్లు లేకపోవడంతో నైట్రైడర్స్కు ఓటమి తప్పలేదు. కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో అతడు ఓ అరుదైన రికార్డునూ సొంతం చేసుకున్నాడు. చెన్నై బౌలర్ శామ్ కరన్ వేసిన ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. అందులో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇలా ఐపీఎల్లో ఒకే ఓవర్లో 30, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో కమిన్స్ ఆరోవాడు.
కమిన్స్ కంటే ముందు క్రిస్ గేల్, సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, షాన్ మార్ష్, రాహుల్ తివాతియా ఒకే ఓవర్లో 30కిపైగా పరుగులు చేశారు. వీళ్లలో గేల్ 36 పరుగులతో టాప్లో ఉన్నాడు. ఆ తర్వాత రైనా 32 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మిగతా నలుగురూ 30 పరుగులు చేశారు. అంతేకాదు వీళ్లలో గేల్ మాత్రమే ఫీట్ను రెండుసార్లు అందుకోవడం విశేషం.
ఇక కమిన్స్ ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదడం ఇది రెండోసారి. గతంలో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ కమిన్స్. ఇందులో గేల్ (ఏడుసార్లు) తొలి స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా(రెండుసార్లు)తో కమిన్స్ జత కలిశాడు.