షాంఘై: ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. యువ ఆర్చరీ జోడీ జ్యోతి సురేఖ, ఓజాస్ దియోతలె పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో భారత్ 156-155 తేడాతో టాప్సీడ్ కొరియా ద్వయం కిమ్ జాంగో, ఒహ్ యుహ్యున్పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో సురేఖ, ఓజాస్ తుదికంటా పోరాడారు. రౌండ్ రౌండ్కు తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. వీరిద్దరు చక్కని సమన్వయంతో ముందుకు సాగుతూ తమ కంటే మెరుగైన సీడింగ్లో ఉన్న కొరియా జోడీకి చెక్ పెడుతూ పసిడి పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే మూడు స్వర్ణ పతకాలు దక్కించుకున్న సురేఖ..బెర్లిన్లో జరిగే ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లోనూ సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో యువ ఆర్చర్ పార్థమేశ్ జావ్కర్ 149-148తో ప్రపంచ నంబర్వన్ మైక్ స్కోలెస్సర్(నెదర్లాండ్స్)పై గెలిచి భారత్కు పసిడి పతకాన్ని అందించాడు.