న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో భారత్కు కాంస్య పతకాన్ని అందించిన శరద్ కుమార్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి ఛాతిలో నొప్పి పెరగడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో చేర్చారు. శరద్ను పరీక్షించిన వైద్యులు గుండె వాపు సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 29 ఏండ్ల శరద్ గురువారం మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నా గుండెకు వాపు ఉన్నట్లు తెలిసింది. వైద్య పరీక్షలతో విసిగిపోయాను. త్వరగా ఇంటికి వెళ్లాలని కోరకుంటున్నా’ అని పేర్కొన్నాడు. టోక్యో వేదికగా ఇటీవల జరిగిన పారాలింపిక్స్ హై జంప్ టీ-42 విభాగంలో శరద్ 1.83 మీటర్ల ఎత్తు దూకి కాంస్య పతకం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.