వందా, రెండొందల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడిన ఆ కుర్రాడు.. పొట్ట కూటి కోసం పానీపూరీ సైతం అమ్మాడు. ప్రాక్టీస్ చేసే స్టేడియం పక్కనే ఓ చిన్న టెంట్లో జీవనం సాగించిన ఆ బుడ్డోడు.. తన లక్ష్యాన్ని మాత్రం ఏనాడు మరవలేదు. ఉన్న ఊరిని, సొంత ఇంటిని విడిచి ముంబైలో క్రికెట్ ఓనమాలు నేర్చిన ఆ చిన్నోడు అంచలంచెలుగా ఎదుగుతూ.. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. దేశవాళీ, రంజీ, లిస్ట్-ఏ, అండర్-19, ఐపీఎల్.. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి తనను తాను నిరూపించుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ యువ సంచలనం యశస్వి జైస్వాల్ అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదుగా!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ‘ప్రాక్టీస్ అనంతరం మైదానానికి సమీపంలో మా బంధువు పానీపూరి బండి దగ్గర పనిచేసేవాడిని. ఆ సమయంలో నాతో పాటు కలిసి క్రికెట్ ఆడే పిల్లలు పానీపూరి తినేందుకు వస్తున్నారంటే చాలా సిగ్గేసేది. వారు నన్ను చూడకపోతే బాగుండు అనుకునేవాడిని’కెరీర్ తొలినాళ్లలో యశస్వి జైస్వాల్ చేసిన వ్యాఖ్యలివి. కడుపు నిండా తిండి.. ప్రాక్టీస్కు సరైన్ కిట్ లేకున్నా.. క్రికెట్ మీద ఇష్టంతో తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న జైస్వాల్.. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జాతీయ జట్టు తలుపుతట్టాడు. దేశవాళీల్లో పరుగులు వరద పారించడంతో పాటు.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సత్తాచాటిన జైస్వాల్ను విండీస్ పర్యటనకు ఎంపిక చేయక తప్పలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో రిజర్వ్ ప్లేయర్గా జట్టుతో పాటు కొనసాగిన యశస్వి.. ఈ అవకాశాన్ని కూడా రెండు చేతులతో అందిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. గత సీజన్ రంజీ విజేత మధ్యప్రదేశ్తో జరిగిన ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి రెండు ఇన్నింగ్స్ల్లో భారీ స్కోర్ల (213, 144)తో విజృంభించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 80.21 సగటుతో పరుగులు రాబట్టిన జైస్వాల్.. ఐపీఎల్ 16వ సీజన్లోనూ సత్తాచాటాడు. లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన (13 బంతుల్లో) అర్ధశతకం నమోదు చేసి ఔరా అనిపించాడు. 2023-25 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిల్ను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారనేది స్పష్టం కాగా.. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో జైస్వాల్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు దింపే అవకాశాలను కొట్టిపారేయలేం. కెరీర్ ఆరంభం నుంచి ఓపెనర్గానే కొనసాగుతున్న యశస్వి అవసరమైతే మూడో స్థానంలోనూ ఆడగలనని గతంలోనే ప్రకటించాడు. రోహిత్, గిల్ రూపంలో ప్రస్తుతం సూపర్ హిట్ ఓపెనింగ్ జోడీ ఉన్నా.. రోహిత్ మరెంతో కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో.. జైస్వాల్ కుదురుకుంటే భారత్కు మరో భావి తార దొరికినట్లే!