టీ20 ప్రపంచకప్లో భాగంగా అబుదబీ స్టేడియంలో ఇవాళ పాకిస్థాన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్లో నమీబియా పోరాడి ఓడింది. పాకిస్థాన్ నాలుగో సారి విజయఢంకా మోగించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని నమీబియా ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నమీబియా 144 పరుగులే చేయడంతో పాకిస్థాన్ 45 పరుగుల తేడాతో గెలిచింది.
నమీబియా ఆటగాళ్లలో డేవిడ్ 31 బంతుల్లో 43, క్రేగ్ విలియమ్స్ 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. స్టీఫన్ బార్డ్ 29 బంతుల్లో 29 పరుగులు, గెర్హార్డ్ 10 బంతుల్లో 15 పరుగులు చేశారు. డేవిడ్ వీసే మాత్రం చివరి ఓవర్లో రెచ్చిపోయాడు. అఫ్రీన్ బౌలింగ్లో ఫోర్లు, సిక్స్ కొట్టి నమీబియా స్కోర్ను పెంచాడు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ 4 ఓవర్లు వేసి 36 పరుగులు అందించాడు. హసన్ అలీ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. ఇమాద్ వాసిమ్ 3 ఓవర్లలో 1 వికెట్, రవుఫ్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్, షాదబ్ ఖాన్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశారు.
పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 50 బంతుల్లో 79 పరుగులు చేసి నాట్ అవుట్గా నిలిచాడు రిజ్వాన్. 8 ఫోర్లు, 4 సిక్స్లు బాదాడు.
4 మ్యాచ్లు ఆడి అన్నింట్లోనూ గెలిచిన పాకిస్థాన్ సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. అలాగే.. టీమ్ 2 పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ టాప్ పొజిషన్లో ఉంది. పాకిస్థాన్కు మొత్తం 8 పాయింట్లు లభించాయి. పాకిస్థాన్ ప్రస్తుతం నెట్ రన్ రేట్ 1.065గా ఉంది. ఇక.. పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోయిన నమీబియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో నమీబియా గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా పోవడంతో నమీబియా సెమీస్ ఆశలు ఆవిరి అయినట్టే.