ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోటీమ్ఇండియా చేతిలో ఎదురైన పరాజయానికి పాకిస్థాన్ బదులు తీర్చుకుంది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన
చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరులో భారత్పై పాక్ పైచేయి సాధించింది. టాస్గెలువడంతోనే దాయాది సగం మ్యాచ్ గెలుచుకోగా.. మెరుగైన ఆరంభం
లభించిన తర్వాత టీమ్ఇండియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. కోహ్లీసాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నా.. రిజ్వాన్ మెరుపుల ముందు భారత్ స్కోరు చిన్నబోయింది. ఇరు జట్లు ఆసియా కప్ ఫైనల్ చేరుకుంటే అభిమానులకు ముచ్చటగా మూడోసారి దాయాదుల పోరు చూసే భాగ్యం దక్కనుంది!
దుబాయ్: చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఆసియాకప్ సూపర్-4 పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా గెలుపొందగా.. తాజా విజయంతో పాక్ లెక్క సరి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (28; ఒక ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ రిజ్వాన్ పట్టుదలతో క్రీజులో నిలిచి పాక్ ఇన్నింగ్స్ను నడిపించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్శ్దీప్, రవి బిష్ణోయ్, పాండ్యా, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. నవాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. భారత్ తమ తదుపరి మ్యాచ్లో మంగళవారం శ్రీలంకతో తలపడనుంది.
పాకిస్థాన్ విజయానికి 12 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన దశలో డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ వేసిన 19 ఓవర్లో మ్యాచ్ మలుపు తిరిగింది. భారీ ఇన్నింగ్స్ ఆడిన మహమ్మద్ రిజ్వాన్ అప్పటికే పెవిలియన్ చేరిపోగా.. క్రీజులో ఉన్న ఇద్దరు కొత్త ఆటగాళ్లను భువీ నిలువరించలేకపోయాడు. తొలి బంతిని వైడ్గా వేసిన అతడు.. రెండో బాల్కు సిక్సర్ సమర్పించుకున్నాడు. మరో వైడ్తో పాటు రెండు ఫోర్లు ఇచ్చుకోవడంతో 19వ ఓవర్లో పాకిస్థాన్ 19 పరుగులు పిండుకుంది. అంతకుముందు రవి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఆసిఫ్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఇచ్చిన అతి సులువైన క్యాచ్ను అర్శ్దీప్ సింగ్ నేలపాలు చేశాడు. దాన్ని సద్వినియోగ పర్చుకున్న ఆసిఫ్ ఆఖర్లో వేగంగా ఆడి పాకిస్థాన్ను గెలిపించాడు.
ఫామ్లేమితో తంటాలు పడుతున్న మాజీకెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలువడంతోనే మరో ఆలోచన లేకుండా బాబర్ బౌలింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రోహిత్ 4, 6 బాదగా.. అతడి తదుపరి ఓవర్లో రాహుల్ రెండు సిక్సర్లు అరుసుకున్నాడు. హరీస్ రవుఫ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ 4,6 కొట్టడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వీరిద్దరి దూకుడుతో 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 54 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇక తిరుగులేదనుకుంటున్న దశలో రోహిత్ ఔట్ కాగా.. తదుపరి ఓవర్లో రాహుల్ అతడిని అనుసరించాడు. సూర్యకుమార్ యాదవ్ (13) ఎక్కువసేపు నిలువలేకపోగా.. దినేశ్ కార్తీక్ను దాటి తుదిజట్టులో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ (14) ఆకట్టుకోలేకపోయాడు. ఒకవైపు వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. కోహ్లీ ఇన్నింగ్స్కు ఇరుసులా నిలబడ్డాడు. పాక్తో జరిగిన గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా (0) డకౌట్ కాగా.. దీపక్ హుడా (16) అండతో కోహ్లీ స్కోరు బోర్డును నడిపించాడు.
వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదిన విరాట్.. వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ పరుగులు రాబట్టాడు. రవుఫ్, హస్నైన్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గని కోహ్లీ.. డీప్ మిడ్వికెట్ దిశగా భారీ సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాజా టోర్నీలో విరాట్కు ఇది రెండో అర్ధశతకం కావడం విశేషం. అయితే ఆఖర్లో హుడా ఔట్ కాగా.. విరాట్ వేగంగా ఆడలేకపోయాడు. చివరి ఓవర్లో ఆసిఫ్ అలీ వేసిన డైరెక్ట్ హిట్కు కోహ్లీ రనౌట్గా వెనుదిరగగా.. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను రవి బిష్ణోయ్ (8 నాటౌట్) బౌండ్రీకి తరలించి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. గత కొన్నాళ్లుగా తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించుకుంటున్న విరాట్.. తాజా పోరులో వింటేజ్ కోహ్లీని గుర్తుకు తెచ్చాడు.
భారత్: రాహుల్ (సి) నవాజ్ (బి) షాదాబ్ 28, రోహిత్ (సి) ఖుష్దిల్ (బి) హరీస్ 28, కోహ్లీ (రనౌట్/ఆసిఫ్) 60, సూర్యకుమార్ (సి) ఆసిఫ్ (బి) నవాజ్ 13, పంత్ (సి) ఆసిఫ్ (బి) షాదాబ్ 14, పాండ్యా (బి) నవాజ్ (బి) హస్నైన్ 0, దీపక్ హుడా (సి) నవాజ్ (బి) నసీమ్ షా 16, భువనేశ్వర్ (నాటౌట్) 0, రవి బిష్ణోయ్ (నాటౌట్) 8, ఎక్స్ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 181/7. వికెట్ల పతనం: 1-54, 2-62, 3-91, 4-126, 5-131, 6-168, 7-173, బౌలింగ్: నసీమ్ షా 4-0-45-1, హస్నైన్ 4-0-38-1, రవుఫ్ 4-0-38-1, నవాజ్ 4-0-25-1, షాదాబ్ 4-0-31-2.
పాకిస్థాన్: రిజ్వాన్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 71, బాబర్ (సి) రోహిత్ (బి) రవి 14, ఫఖర్ (సి) కోహ్లీ (బి) చాహల్ 15, నవాజ్ (సి) హుడా (బి) భువనేశ్వర్ 42, ఖుష్దిల్ (నాటౌట్) 14, ఆసిఫ్ అలీ (ఎల్బీ) 16, ఇఫ్తిఖార్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 19.5 ఓవర్లలో 182/5. వికెట్ల పతనం: 1-22, 2-63, 3-136, 4-147, 5-180, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-40-1, అర్శ్దీప్ 3.5-0-27-1, రవి బిష్ణోయ్ 4-0-26-1, పాండ్యా 4-0-44-1, చాహల్ 4-0-43-1.