SL vs PAK | వన్డే వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటర్లు చెలరేగారు. అబ్దుల్లా షఫీక్ (113), మహ్మద్ రిజ్వాన్ (131) చెరో సెంచరీతో దుమ్మురేపారు. ఫలితంగా ఫలితంగా శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల నష్టానికి ఛేదించారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను ఆదిలోనే దెబ్బకొట్టాలని పాక్ ప్రయత్నించింది. కానీ శ్రీలంక బ్యాటర్లు దుమ్ముదులిపారు. ఓపెనర్ కుశాల్ పెరీరాను పాక్ పేసర్ హసన్ డకౌట్ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాలని ప్రయత్నించినప్పటికీ చెలరేగి ఆడారు. మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనితో జోడీ కట్టిన కుశాల్ మెండీస్ (122 ) కూడా పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సమరవిక్రమ కూడా 89 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. ఫలితంగా మిగిలిన ప్లేయర్లు అంతా తొందరగానే పెవిలియన్కు చేరినప్పటికీ.. శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ బ్యాటర్లు చివరివరకు చెమటోడ్చారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (12), కెప్టెన్ బాబర్ ఆజామ్ (10) విఫలమైన వేళ అబ్దుల్లా షఫీక్ (113), మహ్మాద్ రిజ్వాన్ (131 ) చెలరేగి ఆడారు. ఇద్దరూ చెరో సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ను అందించారు. షఫీక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ (31) , ఇఫ్తిఖర్ అహ్మద్ కూడా రిజ్వాన్కు సపోర్ట్గా నిలిచారు. ఫలితంగా 10 బంతులు మిగిలిఉండగానే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై పాక్ విజయం సాధించింది.