ఎడ్బాస్టన్: సమకాలీన క్రికెట్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోలుస్తుంటారు. ఏ ఫార్మాట్ అయినా అత్యంత నిలకడగా ఆడుతూ ఇంటర్నేషనల్ క్రికెట్లోని టాప్ ప్లేయర్స్తో అతడు పోటీ పడుతున్నాడు. అయితే తాజాగా ఆ క్రికెటర్లందరినీ వెనక్కి నెడుతూ.. ఓ అరుదైన రికార్డును బాబర్ ఆజం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో అతడు సెంచరీ చేశాడు. వన్డేల్లో అతనికిది 14వ సెంచరీ.
అంతేకాదు ఇన్నింగ్స్ పరంగా అత్యంగా వేగంగా 14 సెంచరీలు చేసిన రికార్డును బాబర్ ఆజం సొంతం చేసుకున్నాడు. బాబర్ తన 81వ ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకున్నాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా (84 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (98 ఇన్నింగ్స్) ఉన్నాడు. అదే ఇండియన్ కెప్టెన్ కోహ్లి మాత్రం 14వ సెంచరీని తన 103వ ఇన్నింగ్స్లో సాధించాడు. ఆ లెక్కన కోహ్లి కంటే ఎంతో ముందుగానే బాబర్ ఆ మార్క్ అందుకున్నాడు.
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో బాబర్ 139 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. వన్డేల్లో అతనికిది అత్యధిక వ్యక్తగత స్కోరు కూడా. అయినా ఈ మ్యాచ్లో పాకిస్థాన్కు ఓటమి తప్పలేదు. వన్డేల్లో ప్రస్తుతం బాబర్ ఆజం నంబర్ వన్గా ఉన్నాడు.