PAK vs SA: వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ కథ ముగిసింది. ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న సెమీస్ ఆశలను పూర్తిగా కోల్పోయింది. బ్యాటింగ్లో తడబడ్డా మిడిలార్డర్ రాణించడంతో సౌతాఫ్రికా ఎదుట 271 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన బాబర్ సేన.. ఆఖరి వరకూ పోరాడినా ఫలితం తమకు అనుకూలంగా దక్కలేదు. లక్ష్యాన్ని సఫారీలు ద 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఎయిడెన్ మార్క్రమ్ (93 బంతుల్లో 91, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికాకు టోర్నీలో ఐదో గెలుపును అందించాడు. ఆఖర్లో గెలిచేందుకు అవకాశమొచ్చినా పాకిస్తాన్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా.. పాయింట్ల పట్టికలో భారత్ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలవగా ఆడిన ఆరు మ్యాచ్లలో నాలుగింటిలో ఓడిన పాకిస్తాన్ సెమీస్ ఆశలను వదులుకుంది.
చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో భాగంగా పాక్ నిర్దేశించిన 271 పరుగుల ఛేదనలో సఫారీలు ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. షహీన్ షా అఫ్రిది వేసిన తొలి ఓవర్లోనే వరుసగా నాలుగు బౌండరీలు బాదిన క్వింటన్ డికాక్ (24) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయినా పాక్ బౌలర్ల లయను దెబ్బతీశాడు. దక్షిణాఫ్రికా సారథి బవుమా (28) కూడా ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. వన్ డౌన్లో వచ్చిన డసెన్ (21) తో పాటు ఈ టోర్నీలో భీకర ఫామ్లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (12)లు నిరాశపరిచారు.
మార్క్రమ్ కీలక ఇన్నింగ్స్..
డసెన్, క్లాసెన్లు విఫలమైనా ఎయిడెన్ మార్క్రమ్.. డేవిడ్ మిల్లర్ (33 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కో జాన్సెన్ (14 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్స్) లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి పాకిస్తాన్కు ఎలాంటి అవకాశం లేకుండా చేసేశారు. మిడిల్ ఓవర్స్లో మిల్లర్.. మార్క్రమ్కు అండగా నిలిస్తే ఆఖర్లో జాన్సెన్ ధాటిగా ఆడాడు. స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్పై మహ్మద్ నవాజ్, ఉసామా మిర్, ఇఫ్తికార్ అహ్మద్ వంటి స్పిన్నర్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. హరీస్ రౌఫ్ పెద్దగా ప్రభావం చూపలేదు. మిల్లర్తో కలిసి ఐదో వికెట్కు 69 బంతుల్లో 70 పరుగులు జోడించిన మార్క్రమ్.. జాన్సెన్తో 29 బంతుల్లో 22 పరుగులు జోడించాడు. 50 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న మార్క్రమ్.. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించాడు.
ఆఖర్లో ఉత్కంఠ..
ఆఖర్లో దక్షిణాఫ్రికా విజయానికి 21 పరుగుల దూరంలో మార్క్రమ్ను ఉసామా మిర్.. 40వ ఓవర్ రెండో బంతికి ఔట్ చేసి మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. ఆ మరుసటి ఓవర్లో షహీన్ అఫ్రిది.. గెరాల్డ్ కొయెట్జ్ (10)ను ఔట్ చేయడంతో మ్యాచ్ మరింత రసవత్తరం అయింది. మిర్తో పాటు అఫ్రిది కూడా ఆఖర్లో కట్టడి చేశారు. హరీస్ రౌఫ్ వేసిన 46వ ఓవర్లో మూడో బంతికి లుంగి ఎంగిడి (14 బంతుల్లో 4) అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి వరుస బ్యాటర్ తబ్రేజ్ షంషీ ( 4 నాటౌట్), కేశవ్ మహారాజ్ (21 బంతుల్లో 7 నాటౌట్, 1 ఫోర్) లు ఒత్తిడిని తట్టుకుని సఫారీలకు ఘన విజయాన్ని అందించారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో 1999 తర్వాత పాకిస్తాన్పై సౌతాఫ్రికాకు ఇదే తొలివిజయం. 2015, 2019లలో సఫారీలు ఓడిపోయారు. టీ20 వరల్డ్ కప్లలో కూడా సౌతాఫ్రికాకు వరుసగా పరాభవాలే ఎదురయ్యాయి. ఈ పరాజయంతో పాకిస్తాన్ వరల్డ్ కప్ రేసు నుంచి నిష్క్రమించినట్టే. ఒకవేళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో పాటు శ్రీలంక లు తాము తర్వాత ఆడబోయే మ్యాచ్ లలో దారుణాతి దారుణంగా ఓడితే తప్ప పాకిస్తాన్ సెమీస్ చేరడం అసంభవం..!