Pakistan | పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు ఎన్నాళ్లో వేచిన విజయం ఎట్టకేలకు దరిచేరింది. గెలుపు కోసం ఇన్నాళ్లు కండ్లు కాయలు కాసేలా చూసిన పాక్కు ఓదార్పు విజయం దక్కింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో పాక్ కల సాకారమైంది. ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా ఆదివారం కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది.
సరిగ్గా ఎనిమిదేండ్ల(2015) తర్వాత సఫారీలపై పాక్కు ఇది తొలి గెలుపు కావడం విశేషం. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలుండగానే పాక్ విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సిద్రా అమీన్ 61 పరుగులతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించింది. అమీన్కు తోడు మాజీ కెప్టెన్ బిస్మా మారుఫ్(27), మునీబా అలీ(26*), అలియా రియాజ్(31*) రాణించడం పాక్కు కలిసొచ్చింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే పాక్ మహిళల టీమ్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మంగళవారం ఆఖరి మ్యాచ్ జరుగనుంది.