ODI World Cup 2023 : ఆసియా కప్(Asia Cup 2023) ఓటమి నుంచి ఇంకా తేరుకోని పాకిస్థాన్(Pakistan) జట్టుకు మరో షాక్ తగిలింది. పాక్ పేస్ త్రయంలో ఒకడైన యువ పేసర్ నసీం షా(Naseem Shah) గాయం కారణంగా ప్రపంచ కప్(ODI World Cup 2023) మొత్తానికి దూరమయ్యాడు. దాంతో, అతడి స్థానంలో సెలెక్టర్లు హసన్ అలీ(Hasan Ali)ని 15 మంది స్క్వాడ్లోకి ఎంపిక చేశారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఈరోజు వెల్లడించింది.
‘ఆసియా కప్లో గాయపడిన నసీం షాకు వైద్య పరీక్షలు జరిపాం. డాక్టర్ల సలహా మేరకు అతడికి సర్జరీ చేయించాల్సి ఉంది. నసీం మరో మూడు, నాలుగు నెలల్లో కోలుకునే అవకాశం ఉంది’ అని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆసియా కప్లో సెప్టెంబర్ 11న భారత జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో నసీం గాయపడిన విషయం తెలిసిందే.
హసన్ అలీ, నసీం షా
భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్ సమయంలో నొప్పితో మైదానం వీడిన నసీం ఆ తర్వాత బ్యాటింగ్కు కూడా రాలేదు. దాంతో శ్రీలంకతో మ్యాచ్కు నసీం షా స్థానంలో పేసర్ జమాన్ ఖాన్(Zaman Khan)ను ఆడించారు. అనంతరం నసీంకు దుబాయ్లో స్కానింగ్ నిర్వహించారు. అతడి భుజం గాయం ఇంతకుముందు కంటే ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. దాంతో, ఈ యంగ్ పేసర్ వరల్డ్ కప్తో పాటు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024కు అందుబాటులో ఉండడం లేదు.
హసన్ అలీ 2017లో పాక్ తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకూ 60 వన్డేలు ఆడిన అలీ 30.36 సగటుతో 91 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జనవరిలో సొంతగడ్డపై న్యూజిలాండ్తో అలీ చివరి మ్యాచ్ ఆడాడు. అక్టోబర్ 5న భారత్లో వన్డే ప్రపంచ కప్ మొదలవ్వనుంది. అంతకంటే ముందు సెప్టెంబర్ 29న పాక్ జట్టు న్యూజిలాండ్తో వామప్ మ్యాచ్ ఆడనుది. భారత్, పాకిస్థాన్లు అక్టోబర్ 14న అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్నాయి.