లాహోర్: నిర్ణయాత్మక పోరులో కెప్టెన్ బాబర్ ఆజమ్ (105 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసి 2-1తో సిరీస్ పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ కారీ (56), సీన్ అబాట్ (49) రాణించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్, వసీమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బాబర్ ఆజమ్తో పాటు ఇమాముల్ హక్ (89 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టడంతో పాకిస్థాన్ 37.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 214 పరుగులు చేసింది. మూడు మ్యాచ్ల్లో కలిపి 276 పరుగులు చేసిన బాబర్ ఆజమ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.